
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో గంజాయి (డ్రగ్స్) వ్యవహారం కలకలం రేపింది. యూనివర్సిటీ ప్రాంగణంలో ఈగల్ టీమ్ సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో పలువురు విద్యార్థులు డ్రగ్స్ వినియోగించినట్లు గుర్తించారు. మొత్తం 17 మంది విద్యార్థులకు డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్గా తేలింది. డ్రగ్స్ విక్రయిస్తున్న హెచ్సీయూ పూర్వ విద్యార్థి అరెస్ట్ అయ్యాడు. అతడి వద్ద నుంచి 10 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈగల్ టీమ్కు అందిన సమాచారంతో హెచ్సీయూలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే హెచ్సీయూ పూర్వ విద్యార్థి అరెస్ట్ అయ్యాడు. డ్రగ్ టెస్టుల్లో 17 మంది విద్యార్థులకు పాజిటివ్గా తేలింది. వారి వద్ద నుంచి గంజాయి వినియోగానికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు. విద్యార్థులకు గంజాయి ఎలా చేరుతోంది, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు చేపట్టారు. విచారణలో అస్సాం నుంచి గంజాయిని తీసుకొచ్చి యూనివర్సిటీ పరిసరాల్లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఓ పెడ్లర్ను (హెచ్సీయూ పూర్వ విద్యార్థి) ఈగల్ టీమ్ విచారిస్తోంది. అతడికి గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులు, నెట్వర్క్కు సంబంధించిన వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. విద్యార్థుల్లో డ్రగ్స్ వినియోగం పెరగకుండా కట్టడి చేసేందుకు అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. హెచ్సీయూలో గంజాయి సరఫరా వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.