Reading Time: < 1 minute
Ap Panchayat Elections Sec Polling Stations

Local Elections : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల సమరానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ముమ్మర కసరత్తు ప్రారంభించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల పూర్తిస్థాయి ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, నివేదికల సేకరణపై ఎస్‌ఈసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన పోలింగ్ స్టేషన్ల వివరాలను తక్షణమే సిద్ధం చేయాలని క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని పురమాయించింది.

పోలింగ్ కేంద్రాల ప్రక్రియ.. వారం రోజుల్లో తుది జాబితా ఖరారు

ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్‌ఈసీ స్పష్టమైన టైమ్‌లైన్‌ను ఖరారు చేసింది. దీని ప్రకారం ఈ నెల 21 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అవసరమయ్యే పోలింగ్ స్టేషన్ల వివరాలన్నీ పూర్తిస్థాయిలో సిద్ధం కానున్నాయి. అనంతరం ఈ నెల 23న ఆ వివరాలను బహిరంగంగా ప్రచురిస్తారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే తెలపడానికి ఈ నెల 26 వరకు గడువు ఇచ్చారు. వచ్చిన వినతులను పరిశీలించిన అనంతరం ఈ నెల 29 నాటికి సంబంధిత జిల్లాల కలెక్టర్లు పోలింగ్ స్టేషన్ల జాబితాకు ఆమోదం తెలుపుతారు. చివరగా ఈ నెల 31వ తేదీన ఆమోదించిన పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను అధికారికంగా వెల్లడించి, పంచాయతీ పోరుకు మార్గాన్ని సుగమం చేయనున్నారు.