
ప్యాకేజ్డ్ ఫుడ్స్లో అధికంగా ఉండే చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులపై ఫ్రంట్-ఆఫ్-ప్యాక్ వార్నింగ్ లేబుల్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఈ అంశంపై కేంద్రం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరోసారి తమ వైఖరిని పునఃపరిశీలించాలని రెండు వారాల గడువు ఇచ్చింది. అధికారులు చర్యలు తీసుకోకపోతే తామే ఆదేశాలు జారీ చేస్తామని కోర్టు హెచ్చరించింది.
జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై కేంద్రం, FSSAI తీరును ప్రశ్నించింది. ‘‘మీరు చేయలేకపోతే మేమే చేస్తాం’’ అని స్పష్టం చేసింది. అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించింది. అలాగే పెద్ద కార్పొరేట్ సంస్థల ఒత్తిడి ప్రభుత్వ వైఖరిపై ప్రభావం చూపుతోందా? అని కూడా ధర్మాసనం ప్రశ్నించింది.
ప్రజల ఆరోగ్యమే ముఖ్యం
ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల్లో అధిక స్థాయిలో చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులు ఉంటే వాటిని ప్యాక్ ముందు భాగంలోనే స్పష్టంగా హెచ్చరికల రూపంలో చూపించాలన్న అంశంపై ఈ విచారణ జరిగింది. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కావడంతో నిర్ణయాలు కార్పొరేట్ సంస్థల ఒత్తిడికి ప్రభావితం కాకూడదని కోర్టు పేర్కొంది. ‘‘ఈ అంశం పౌరుల ఆరోగ్యానికి, ముఖ్యంగా పెరుగుతున్న పిల్లల ఆరోగ్యానికి సంబంధించినది. దీనిపై నిర్ణయాలు కార్పొరేట్ ఒత్తిడితో ప్రభావితం కాకూడదు’’ అని ధర్మాసనం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఫ్రంట్-ఆఫ్-ప్యాక్ లేబులింగ్పై గతంలో చర్చించిన విధానానికి భిన్నంగా FSSAI తాజాగా ఓ ప్రతిపాదన చేసింది. ‘‘High Sodium Level’’, ‘‘High Sugar Level’’, ‘‘High Saturated Fat Level’’ వంటి నేరుగా హెచ్చరికలు ఇవ్వడానికి బదులుగా.. ఆహారంలో ఉండే అదనపు చక్కెర, సంతృప్త కొవ్వు, ఉప్పు పరిమాణాలను రోజువారీ సిఫార్సు చేసిన పరిమితులతో పోల్చుకునేలా చిత్రరూపంలో చూపించాలని ప్రతిపాదించింది. 2024లో ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ రూపొందించిన భారతీయుల ఆహార మార్గదర్శకాలను ఆధారంగా చేసుకుని రోజుకు 25 గ్రాముల చక్కెర, 10 గ్రాముల సంతృప్త కొవ్వు, 5 గ్రాముల ఉప్పు పరిమితులను FSSAI ప్రస్తావించింది. అయితే మార్చి 19, 2026న నిర్వహించిన స్టేక్హోల్డర్ సంప్రదింపుల్లో మెజారిటీ పరిశ్రమ సంస్థలు వార్నింగ్ లేబుల్స్ను వ్యతిరేకించాయని FSSAI తెలిపింది. వినియోగదారులకు భయం కలిగించకుండా సమాచారం అందించి నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించే విధానాన్ని పరిశ్రమ ప్రతినిధులు కోరినట్లు పేర్కొంది.
పిటిషనర్ తరఫున న్యాయవాది రాజీవ్ శంకర్ ద్వివేది FSSAI ప్రతిపాదనను వ్యతిరేకించారు. కేవలం సంఖ్యల రూపంలో పోషక విలువలను చూపించడం వల్ల వినియోగదారులు ముందుగా ఆ వివరాలను వెతికి, రోజువారీ పరిమితులతో పోల్చి, ఆ ఉత్పత్తిలో చక్కెర, ఉప్పు లేదా సంతృప్త కొవ్వు అధికంగా ఉందో లేదో నిర్ణయించుకోవాల్సి వస్తుందని వాదించారు. ఫ్రంట్-ఆఫ్-ప్యాక్ వార్నింగ్ లేబుల్స్ ఉద్దేశం వినియోగదారులు వెంటనే ఒక ఉత్పత్తిని ఎంచుకునేలా స్పష్టమైన సమాచారం అందించడమేనని ఆయన తెలిపారు. ముఖ్యంగా తక్కువ అక్షరాస్యత, ఆరోగ్య సంబంధిత అవగాహన తక్కువగా ఉన్నవారికి కేవలం సంఖ్యల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుందని పేర్కొన్నారు.
‘‘భారత్ ఇంకా అభివృద్ధి చెందని దేశంగానే ఉండాలా?’’
కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ బ్రిజేందర్ చాహర్ వాదనలు వినిపిస్తూ.. భారత్, ఇతర అభివృద్ధి చెందిన దేశాల ఆహార విధానాల్లో తేడాలు ఉన్నాయని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సాధారణంగా ఉప్పు, చక్కెర, కొవ్వు స్థాయిలు తక్కువగా ఉంటాయని, అంతర్జాతీయ ప్రమాణాలను భారతీయ సంప్రదాయ ఆహారాలకు నేరుగా వర్తింపజేయలేమని వాదించారు. ఈ వాదనపై జస్టిస్ పర్దీవాలా తీవ్రంగా స్పందించారు. ‘‘భారత్ ఇంకా అభివృద్ధి చెందని దేశంగానే ఉండాలా?’’ అని ప్రశ్నించినట్లు సమాచారం.
కేంద్రం తన వాదనలో భాగంగా నమ్కీన్ వంటి సంప్రదాయ భారతీయ ఆహార పదార్థాలపై కూడా ఎరుపు రంగు హెచ్చరిక గుర్తులు కనిపించే అవకాశం ఉందని ప్రస్తావించింది. తయారీ పరిశ్రమ తరఫున సీనియర్ న్యాయవాది మనీందర్ సింగ్ కూడా FSSAI ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. వార్నింగ్ లేబుల్స్ ఉద్దేశం ఉత్పత్తుల అమ్మకాలను అడ్డుకోవడం కాదని, వాటి గురించి వినియోగదారులకు స్పష్టమైన సమాచారం అందించడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘‘తయారీదారులకు ఇది నచ్చకపోవచ్చు. కానీ వినియోగదారులకు మాత్రం తెలియాలి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉత్పత్తిని కొనుగోలు చేయాలా? వద్దా? అనే తుది నిర్ణయం వినియోగదారుడిదేనని పేర్కొంది. ఈ విషయంలో తయారీదారులకు నిర్ణయాత్మక పాత్ర ఉండదని స్పష్టం చేసింది.
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉండటంపై జస్టిస్ పర్దీవాలా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మన దేశంలో ఎంతమంది పిల్లలు డ్రై ఫ్రూట్స్ కొనగలరు? ఎంతమంది కుర్కురే కొంటారు? అదే తేడా’’ అని వ్యాఖ్యానించారు.
ఆదేశాలను గుర్తుచేసిన కోర్టు
3S అండ్ అవర్ హెల్త్ సొసైటీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ విచారణ కొనసాగుతోంది. ఫిబ్రవరి 10న జరిగిన విచారణలో FSSAI సమర్పించిన కంప్లయన్స్ అఫిడవిట్పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు చేపట్టిన చర్యలతో ఎలాంటి ‘‘సానుకూల లేదా మంచి ఫలితం’’ కనిపించలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో FSSAI నిపుణుల కమిటీ ఈ అంశాన్ని మరోసారి పరిశీలించాలని కోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 10న ఇచ్చిన ఆదేశం కేవలం సూచన కాదని, FSSAI పాటించాల్సిన ఆదేశమని తాజా విచారణలో ధర్మాసనం స్పష్టం చేసింది. ఫ్రంట్-ఆఫ్-ప్యాక్ వార్నింగ్ లేబుల్స్పై తమ ప్రతిపాదనను కేంద్రం, FSSAI మరోసారి పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది. అధికారులు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోకపోతే తదుపరి విచారణలో కోర్టే నిర్ణయం తీసుకుంటుందని హెచ్చరించింది.