
IEA: ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ప్రశంసలు లభించాయి. గ్రామీణ భారతదేశం మహిళలకు పరిశుభ్రమైన వంట ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ పథకాన్ని అంతర్జాతీయ ఇంధన సంస్థ(IEA) చీఫ్ ఫాతిహ్ బిరోల్ ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సబ్సిడీతో ఎల్పీజీని అందించడంలో ఉజ్వల పథకం సహాయపడిందని, మహిళల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చిందని బిరోల్ పేర్కొన్నారు.
ఉజ్వల పథకం, మహిళల ఓట్లు ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల విజయాలకు కీలకంగా మారాయని చెప్పారు. 2016 మేలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా పేద, గ్రామీణ కుటుంబాలను కట్టెలు, బొగ్గు వంటి సంప్రదాయ వంట ఇంధనాల నుంచి ఎల్పీజీకి మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటి ద్వారా వచ్చే పొగ మహిళల ఆరోగ్యం, వంట చేసే సమయంపై చాలా ప్రభావం చూపుతుందని, వీటి నుంచి వారిని రక్షించేందుకు ఎన్డీయే సర్కార్ ఉజ్వల పథకాన్ని తీసుకువచ్చింది.
ఉత్తరప్రదేశ్లోని బల్లియాలో 2016 మే 1న ప్రధాని మోదీ ఉజ్వల పథకాన్ని ప్రారంభించారు. 2020 మార్చి నాటికి పేద కుటుంబాలకు 8 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు అందించాలన్నది ప్రారంభ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని నిర్ణీత గడువుకు ముందే సాధించారు. 2019 సెప్టెంబర్ 7న మహారాష్ట్ర ఔరంగబాద్ లో మోడీ 8 కోట్లవ ఉజ్వల ఎల్పీజీ కనెక్షన్ అందచేశారు. 2025 మార్చి 1 నాటికి దేశవ్యాప్తంగా 10.33 కోట్లకు పైగా కనెక్షన్ల మైలురాయికి చేరుకుంది. ఉజ్వల లబ్ధిదారులకు ప్రభుత్వం ఎల్పీజీ సబ్సిడీని కొనసాగిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో లబ్ధిదారులకు రూ. 12000 కోట్ల సబ్సిడీ కేటాయింపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద అర్హులైన వినియోగదారులకు ఒక్కో సిలిండర్పై రూ. 300 సబ్సిడీ లభిస్తోంది.