
భువనగిరి: యాదాద్రి భువనగరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బంగారు, వెండి, డాలర్లు మాయమయ్యాయి. భక్తులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న బంగారు, వెండి డాలర్లు పెద్ద సంఖ్యలో గల్లంతు కావడంతో సంచలనం సృష్టిస్తోంది. ఆడిట్ అధికారులు ఆలయ రికార్డులను తనిఖీ చేస్తుండగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్టాక్ రిజస్టర్ లో నమోదు చేసి లెక్కలకు, నిల్వ ఉన్న నాణేలకు సరిపోవడం లేదు. నిల్వ ఉంచిన డాలర్ల లెక్కల్లో భారీ తేడాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. స్వామివారి ప్రతిమతో పాటు డాలర్ల విలువ కలిపి పది లక్షల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారు. సిబ్బంది చేతివాటంతోనే ఇది జరగడంతో విచారణకు ఆదేశించారు. లోతైన విచారణ జరపడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.