Reading Time: < 1 minute
Nasa: నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లిన ఓరియన్‌ రాకెట్‌.. ఆర్టెమిస్-2 ప్రయోగాన్ని సక్సెస్ చేసిన నాసా

అంతరిక్ష ప్రయోగంలో మరో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆర్టెమిస్-2 అనే ప్రయోగాన్ని చేపట్టింది. ఈ ప్రయోగంలో భాగంగా ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్‌ను నింగిలోకి పంపింది. సుమారు 53 ఏళ్ల తర్వాత రెండోసారి చంద్రుడి దగ్గరకు ఆర్టెమిస్-2 మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములు బయలుదేరారు. చంద్రుడికి 10 వేల 300 కిలో మీటర్ల సమీపం వరకు వెళ్లి 10 రోజుల పాటు అంతరిక్షంలో ప్రయాణించనుంది ఈ వ్యోమనౌక

ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి భారీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ అద్భుతాన్ని చూసేందుకు వేలాది మంది ప్రజలు రోడ్లు, బీచ్‌ల వద్ద గుమిగూడారు. ఇది 1960, 70వ దశకాల్లో జరిగిన ‘అపోలో’ మిషన్ల రోజులను గుర్తుకు తెచ్చింది. చంద్రుడిపై శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేయాలనే నాసా లక్ష్యంలో ఇది అతిపెద్ద అడుగు కానుంది.

యాత్ర అనంతరం ఈ వ్యోమనౌక పసిఫిక్ సముద్రంలో ల్యాండ్ అయ్యేలా నాసా ప్లాన్ చేసింది.1972లో అపోలో-17 తర్వాత మనుషులు భూకక్ష్యను దాటి వెళ్తుండటం మళ్లీ ఇదే తొలిసారి. కమాండర్ రీడ్‌ వైజ్‌మాన్‌తో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు ఆర్టెమిస్-2లో మూన్‌ మిషన్‌కి వెళ్తున్నారు. ఈ టీమ్‌లో ఒక మహిళ కూడా ఉన్నారు. 2 లక్షల 48 వేల కిలోమీటర్లు ప్రయాణించి వీళ్లు చంద్రుడికి దగ్గరగా చేరుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ భూమి వైపు తిరుగు ప్రయాణమై పసిఫిక్ మహాసముద్రంలో దిగుతారు.

ఒకవేళ ఆటోమేటిక్ సిస్టమ్స్ విఫలమైతే, వ్యోమగాములు స్వయంగా క్యాప్సూల్‌ను ఎలా నియంత్రించాలో ఈ ప్రయాణంలో పరీక్షించనున్నారు. చంద్రుడిని దగ్గరగా చూడటమే కాకుండా, అంతరిక్షం నుండి సూర్యగ్రహణాన్ని కూడా వీరు చూడగలుగుతారు.

తొలి మానవాలి ప్రయోగం

అయితే నాసా గతంలో చేపట్టిన ‘ఆర్టెమిస్-1’ ప్రయోగంలో మనుషులు చంద్రుడిపైకి వెళ్లలేదు. కానీ ఈ సారి కానీ ఈ ‘ఆర్టెమిస్-2’లో వ్యోమగాములు ఉండటంతో, వారి కోసం అవసరమైన ఆక్సిజన్, నీరు, టాయిలెట్ వంటి సదుపాయాలను మొదటిసారిగా ఈ క్యాప్సూల్‌లో అమర్చారు. అందుకే ఈ మిషన్ ఎంతో సవాలుతో కూడుకున్నదిగా నాసా పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.