
ప్రపంచ సినిమా గర్వించదగ్గ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ప్రస్తుతం దర్శక దిగ్గజం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ మరియు విడుదల విషయంలో రాజమౌళి.. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ధురంధర్ను ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి వారణాసి సినిమా ఒక్కటే పార్ట్గా రానుందని స్వయంగా రాజమౌళినే క్లారిటీ ఇచ్చారు.
కానీ ఇప్పుడు కథా బడ్జెట్ దృష్ట్యా రెండు భాగాలుగా చేయాలని భావిస్తున్నారట. అంతేకాదు పార్ట్ 2ని తక్కువ గ్యాప్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇటీవల బాలీవుడ్లో వచ్చిన ‘ధురంధర్’ రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్ను ఒకేసారి పూర్తి చేసి కేవలం మూడు నెలల వ్యవధిలోనే పార్ట్ 1 పార్ట్ 2లను విడుదల చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు రాజమౌళి కూడా వారణాసి షూటింగ్ను ఏకధాటిగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత సినిమాను రెండు భాగాలుగా విభజించి.. కేవలం మూడు నెలల గ్యాప్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది జక్కన్న ప్లాన్గా తెలుస్తోంది. గతంలో ‘బాహుబలి’ రెండు భాగాలకు గాను దాదాపు రెండేళ్ల సమయం తీసుకున్నాడు రాజమౌళి. కానీ ఈసారి ప్రేక్షకులు కథను మర్చిపోకుండా ఆ ఎగ్జైట్మెంట్ను అలాగే కొనసాగించేందుకు ఈ సరికొత్త నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయినా కూడా సినిమా అనుకున్న సమయానికి 2027 ఏప్రిల్ 7న థియేటర్లోకి రావడం పక్కా అని టాక్.