Reading Time: < 1 minute
Kcr Brs Palamuru Rangareddy Project Public Meetings

KCR : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు సమరశంఖం పూరించారు. శుక్రవారం ఎర్రవల్లిలోని తన నివాసంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ముఖ్య నేతలతో ఆయన సుదీర్ఘంగా సమావేశమై పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేశారు. ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ నీటి కేటాయింపులకు అంగీకరించడం ద్వారా దక్షిణ తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు.

ఈ అన్యాయాన్ని ఎండగట్టడమే కాకుండా, క్షేత్రస్థాయిలో రైతులను చైతన్యపరచడానికి మూడు ఉమ్మడి జిల్లాల్లో మూడు భారీ బహిరంగ సభలను నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో ఒక సభను, నల్గొండ జిల్లాలోని దేవరకొండ లేదా కొండమల్లేపల్లిలో రెండో సభను, మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యంత భారీ స్థాయిలో మూడో సభను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

రాజుగారి పెళ్లిరో.. Anaganaga Oka Raju లిరికల్‌ వీడియో రిలీజ్!

రాబోయే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ బహిరంగ సభలను ప్రారంభించాలని కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. సంక్రాంతి పండుగ కంటే ముందే ఒక సభను నిర్వహించి, పండుగ తర్వాత మిగిలిన రెండు సభలను పూర్తి చేయాలా? లేక మూడు సభలను సంక్రాంతి తర్వాతే వరుసగా నిర్వహించాలా? అనే అంశంపై తేదీలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయిన నేపథ్యంలో, మళ్ళీ ‘నీళ్లు-నిధులు-నియామకాలు’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు.

ముఖ్యంగా ఈ మూడు సభలకు కేసీఆర్ స్వయంగా హాజరై ప్రసంగించబోతుండటంతో అటు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. గత పదేళ్ల తమ పాలనలో చేసిన అభివృద్ధిని, ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పోలుస్తూ ప్రజల్లోకి వెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో వెనకడుగు వేయకూడదని ఆయన నేతలకు స్పష్టం చేశారు. ఈ సభల ద్వారా దక్షిణ తెలంగాణలో బీఆర్‌ఎస్ తన పట్టును తిరిగి నిరూపించుకోవాలని చూస్తోంది.

రాజుగారి పెళ్లిరో.. Anaganaga Oka Raju లిరికల్‌ వీడియో రిలీజ్!