
హైదరాబాద్ లో హనుమాన్ జయంతి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ సర్వం సిద్ధం చేస్తోంది. ఈ వేడుకల భద్రతా ఏర్పాట్లపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ (మార్చి31) ఇతర శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
రెండు రోజుల క్రితం జరిగిన శ్రీరామ నవమి శోభాయాత్రను అత్యంత ప్రశాంతంగా నిర్వహించామని తెలిపిన సీపీ అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అదే స్ఫూర్తితో హనుమాన్ శోభాయాత్రను కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 2న నగర వ్యాప్తంగా మొత్తం 168 శోభాయాత్ర ఊరేగింపులు జరగనున్నాయి. ప్రధాన శోభాయాత్ర రాం మందిర్ గౌలిగూడా నుంచి అఫ్జల్ గుంజ్ మీదుగా తాడ్ బండ్ వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర సాగనుంది. ఇందులో 10.5 కిలోమీటర్లు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉండగా, మిగిలిన భాగం మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో సాగుతుంది. ఈ సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ కూడా పాల్గొని భద్రతా పరమైన అంశాలపై చర్చించారు.
ALSO READ : బెంగళూరులో బైక్ టాక్సీ డ్రైవర్ బాగోతం
యాత్ర సాఫీగా సాగేందుకు సుమారు 3000 మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక , ముఖ్యమైన ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ బలగాలతో పాటు అదనపు సిబ్బందిని నిరంతరం అందుబాటులో ఉంచుతామని సీపీ స్పష్టం చేశారు.శోభాయాత్ర నిర్వాహకులకు ఇప్పటికే తగిన సూచనలు జారీ చేశామని, భక్తులు, ప్రజలందరూ పోలీసులకు సహకరించి, ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.