Reading Time: 2 minutes
Gas Cylinder: ఈ చిన్న పని చేయకపోతే రూ.300 గ్యాస్ సబ్సిడీ కట్.. నేడే లాస్ట్ డేట్.. వెంటనే చేస్కోండి..

దేశంలోని పేదలకు తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందించడంతో పాటు తొలిసారి సిలిండర్ ఉచితంగా అందిస్తోంది. ఆ తర్వాత సిలిండర్ రీఫిల్లింగ్‌పై సబ్సిడీ అందిస్తోంది. 14.2 కిలోల సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ ఇస్తోంది. వీటిని నేరుగా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తోంది. అయితే సబ్సిడీ పొందుతున్న పీఎంయూవై లబ్దిదారులకు కేంద్రం కొత్త నిబంధన విధించింది.

కేవైసీ తప్పనిసరి చేసిన కేంద్రం

ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీచేసింది. వీరికి కేవైసీని తప్పనిసరి చేసింది. ప్రతీ ఆర్దిక సంత్సరంలో ఒకసారి తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలనే నిబంధన విధించింది. అయితే ఈ కేవైసీ చేయించుకోకపోతే రూ.300 సబ్సిడీ నిలిపివేయనుందని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీ అయిన హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. ఈ మేరకు ఎక్స్‌లో వివరాలు వెల్లడించింది.14.2 కిలోల సిలిండర్లకు సంబంధించి 8,9వ రీఫిల్‌పై రూ.300 సబ్సిడీ పొందాలంటే తప్పనిసరిగా బయోమెట్రిక్ ఆధార్ ఐథెంటిఫికేషన్ చేయించుకోవాలని సూచించింది. ఇక 5 కిలోల సిలిండర్ వాడుతుంటే.. 21 రిఫీల్‌కు ఇది వర్తిస్తుంది.

మార్చి 31లోపు చేయించుకోవాల్సిందే..

రూ.300 సబ్సిడీ కోల్పోకుండా ఉండాలంటే మార్చి 31,2026లోపు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి. లేకపోతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా రావాల్సిన రూ.300 సబ్సిడీ ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. ఇక గ్యాస్ రీఫిల్లింగ్ సేవలు కూడా నిలిచిపోయే అవకాశముంది. ప్రతీ ఏడాదిలో ఒక్కసారైనా కేవైసీ పూర్తి చేస్తే సబ్సిడీ, రీఫిల్లింగ్‌లో ఎలాంటి అంతరాయాలు ఉండవు. అయితే కేవైసీని ఇంట్లోనే ఉండి సులువుగా చేసుకోవచ్చు. మీకు గ్యాస్ డెలివరీ చేయడానికి వచ్చే డెలివరీ బాయ్ దగ్గర ఉండే బయోమెట్రిక్ మెషీన్ ద్వారా ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. అలాగే ఆన్‌లైన్ విధానంలోనూ చేసుకోవచ్చు. లేదా మీ కంపెనీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి పూర్తి చేయవచ్చు.