Reading Time: 2 minutes
10 Year Old Boy Who Served Tea And Lassi To Soldiers During Op Sindoor Wins Bal Puraskar

Droupadi Murmu: 10 ఏళ్ల బాలుడు శ్రవణ్ సింగ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ‘‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం’’ దక్కింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో యుద్ధభూమిలో ఉన్న మన జవాన్లకు నీరు, పాలు, లస్సీ అందిస్తూ తన దేశభక్తిని చాటుకున్నాడు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లోని తన ఇంటికి సమీపంలో ఉన్న పాక్ సరిహద్దుల్లో మోహరించిన భారత సైన్యానికి క్రమం తప్పకుండా సేవ చేశాడు. శ్రవణ్ సింగ్ కనబరిచిన దేశభక్తికి రాష్ట్రపతి నుంచి శుక్రవారం ఈ పురస్కారం దక్కింది.

Read Also: Mecca: మక్కా మసీదులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. రక్షించిన వీడియో వైరల్..

‘‘పాకిస్థాన్‌పై ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైనప్పుడు, సైనికులు మా గ్రామానికి వచ్చారు. నేను వారికి సేవ చేయాలని అనుకున్నాను. నేను వారికి ప్రతిరోజూ పాలు, టీ, మజ్జిగ, ఐస్ తీసుకువెళ్లేవాడిని’’ అని బాలుడు మీడియాతో చెప్పారు. 10 ఏళ్ల బాలుడి సేవ దేశభక్తిని వయసుతో కాదు, చర్యలతో నిర్వచిస్తాయి అని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు.‘‘ ఫిరోజ్‌పూర్‌లోని చక్ తరణ్ వాలి గ్రామానికి చెందిన 10 ఏళ్ల శ్రావణ్ సింగ్ అసాధారణ ధైర్యం, కరుణను ప్రదర్శించాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో, అధిక ప్రమాదకర సరిహద్దు పోస్టుల వద్ద ప్రమాదం పొంచి ఉండగా, శ్రావణ్ నిస్వార్థంగా ఫ్రంట్ లైన్‌లో ఉన్న భారత సైనిక సిబ్బందికి నీరు, పాలు, టీ అందించాడు. చాలా మంది పెద్దలు సంకోచించే చోట స్థిరంగా నిలిచాడు. అతని ధైర్యం, సేవా భావం దేశభక్తిని వయస్సు ద్వారా కాదు, చర్య ద్వారా నిర్వచించబడుతుందని మనకు గుర్తు చేస్తుంది’’ అని ఎక్స్‌లో ఎంపీ ట్వీట్ చేశారు.

రాష్ట్రీయ బాల్ పురస్కార్ అనేది ధైర్యసాహసాలు, కళ – సంస్కృతి, పర్యావరణం, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలలో అసాధారణ ప్రతిభ చూపిన పిల్లలకు భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రదానం చేసే ప్రతిష్టాత్మక జాతీయ గౌరవం. డిసెంబర్ 26న వీర్ బాల్ దివాస్ ప్రాముఖ్యత గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. భారతీయులంతా పూజించే పదవ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ జీ, ఆయన నలుగురు కుమారులు సత్యం, న్యాయానికి మద్దతుగా పోరాడుతూ అత్యున్నత త్యాగాలు చేశారని అన్నారు.