
కిరణ్ అబ్బవరం నిర్మాతగా దాదాపు 50 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ను పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు మంచి అప్లాజ్ దక్కింది. ఇందులో విలన్ పాత్రలో సిద్ధయ్యగా నటించిన యాక్టర్ లతీష్.. తనకు దక్కిన మొదటి విజయం గురించి చెబుతూ సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు. లతీష్ మాట్లాడుతూ ‘చిత్తూరు జిల్లా నగరిలో మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం.
బెంగళూరులో కొన్ని రోజులు ఉద్యోగం చేశా. 2017లో హైదరాబాద్కి వచ్చాను. అప్పటి నుంచే సినిమాల్లో నటించాలని ప్రయత్నించాను. అందరూ నా యాక్టింగ్ బాగానే ఉందని చెప్పేవారు. కానీ అవకాశాలు వచ్చేవికావు. యూట్యూబ్లో ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసి యాక్ట్ చేశాను. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రంలో విలన్గా నటించడం చాలా ఎక్సయిటింగ్గా అనిపించింది.
సినిమాకి హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ మూవీ కోసం ఏకంగా ముప్పై కిలోల బరువు పెరిగాను. సిద్ధయ్య పాత్రకు సరిపోవాలని చాలా శ్రమించాను. సినిమా చూసిన వారంతా అది నువ్వేనా అని అడుగుతుంటే ఎంతో సంతోషంగా, సంతృప్తిగా అనిపించింది. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నా. త్వరలోనే వాటిన అనౌన్స్ చేస్తా’ అని చెప్పాడు.