
తెలుగు మాట్లాడే మహిళలను టెలీకాలర్లుగా నియమించుకుని, తెలంగాణలోని అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని భారీగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ముఠా గుట్టును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) రట్టు చేసింది. ఢిల్లీలోని శివ మార్కెట్లో నిర్వహిస్తున్న మూడు మోసపూరిత కాల్ సెంటర్లపై సమన్వయంతో దాడులు నిర్వహించిన అధికారులు, 21 మంది మహిళా టెలీకాలర్లు , ఒక పురుష బ్యాంకు ఖాతాదారుడిని అదుపులోకి తీసుకున్నారు. లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ అనే ముగ్గురు ప్రధాన నిర్వాహకుల నేతృత్వంలో వేర్వేరు బృందాలుగా ఈ కాల్ సెంటర్లు గత ఏడాదిన్నర కాలంగా పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అయితే ఈ ప్రధాన నిర్వాహకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
తెలుగు అమ్మాయిలే ఆయుధంగా.. రుణాల పేరుతో దారుణ దోపిడీ
మోసగాళ్లు ప్రత్యేకంగా 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న, తెలుగు మాట్లాడే మహిళలను టెలీకాలర్లుగా నియమించుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, హైదరాబాద్లోని సైదాబాద్, బోరబండ, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన మహిళలు ఈ కాల్ సెంటర్లలో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తమ సొంత భాషలో అనర్గళంగా మాట్లాడటంతో బాధితులు సులభంగా వీరిని నమ్మేవారు. తాము బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులమని చెప్పి, ఆకర్షణీయమైన రుణ ఆఫర్లు ఉన్నాయంటూ వల వేసేవారు. రుణం మంజూరు కావాంటే ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, బీమా ప్రీమియంల పేరుతో విడతలవారీగా డబ్బులు వసూలు చేసి, ఆ తర్వాత సంభాషణలు నిలిపివేసేవారు.
బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్ – 22 కేసులతో లింకులు
తాము మోసపోయామని గ్రహించిన బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే నిందితులు దారుణ బెదిరింపులకు దిగేవారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వ్యక్తిగత సమాచారాన్ని, గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేసి పరువు తీస్తామని హెచ్చరిస్తూ భయభ్రాంతులకు గురిచేసేవారు. ఈ ఆపరేషన్లో భాగంగా అధికారులు 23 మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంకు పాస్బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నమోదైన 22 సైబర్ నేర కేసులతో ఈ ముఠాకు సంబంధాలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారుల కోసం పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేశారు.