
JNU Protest: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) మరోసారి వివాదంలోకి వచ్చింది. సోమవారం యూనివర్సిటీ క్యాంపస్లో ఉమర్ ఖాలిద్ రచించిన ‘Fractured Communities’ పుస్తకంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా JNU విద్యార్థి సంఘం (JNUSU) నేతలు ఉమర్ ఖాలిద్ విడుదలను డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. SSS-2 భవనం బయట నిర్వహించిన కార్యక్రమంలో ‘ఉమర్ ఖాలిద్ను విడుదల చేయాలి’, ‘జైలు తాళాలు బద్దలవుతాయి.. సహచరులంతా విడుదలవుతారు’ వంటి నినాదాలు చేశారు. దీనికి వ్యతిరేకించిన ABVP మద్దతుదారులు కూడా నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పుస్తకంపై చర్చ కోసం ఆడిటోరియంను ముందుగా బుక్ చేసుకున్నప్పటికీ, JNU పరిపాలన చివరి నిమిషంలో అనుమతిని రద్దు చేసింది. అయినప్పటికీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించిన విద్యార్థి సంఘం.. SSS-2 భవనం బయట చర్చను కొనసాగించింది. వందలాది మంది విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారని JNUSU తెలిపింది. కార్యక్రమాన్ని ABVP మద్దతుదారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారని JNUSU ఆరోపించింది. స్పీకర్ నుంచి మైక్రోఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించడంతో పాటు ప్యానెలిస్టులతో దురుసుగా ప్రవర్తించారని విద్యార్థి సంఘం నాయకులు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలపై ABVP లేదా JNU పరిపాలన యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ ఘటన అనంతరం JNUSU ఓ ప్రకటన విడుదల చేసింది. యూనివర్సిటీలో చర్చ, వాదన, భిన్నాభిప్రాయాలకు ఉన్న స్థలాన్ని పరిరక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఉమర్ ఖాలిద్తో పాటు తాము ‘రాజకీయ ఖైదీలు’గా భావించే వారికి మద్దతు కొనసాగిస్తామని పేర్కొంది. ABVPపై ద్వేషం, హింసను ప్రోత్సహిస్తూ విద్యా చర్చలను అడ్డుకుంటోందని ఆరోపించింది. ఉమర్ ఖాలిద్ అంశంపై JNUలో మరోసారి నినాదాలు, నిరసనలు చోటుచేసుకోవడంతో క్యాంపస్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.