
క్రికెట్ స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ (కేఎన్సీబీ) కలిసి పురుషుల వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవల చేసిన మార్పులను తీవ్రంగా విమర్శించాయి. ఈ మార్పుల సమాచారం గురించి ఐసీసీ తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇతర అసోసియేట్ సభ్యులతో కలిసి ఈ మార్పులకు సంబంధించిన ప్రక్రియపై స్పష్టత , అధికారిక లిఖితపూర్వక సమాచారం కోరుతూ ఐసీసీతో రెండుసార్లు సమావేశమయ్యామని, అయితే రెండో సమావేశం జరిగి రెండు వారాలు దాటినా ఐసీసీ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం తీవ్ర నిరాశాజనకం అని పేర్కొన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ విస్తరణకు, కొత్త ప్రేక్షకులను ఆకర్షించేందుకు కృషి జరుగుతున్న సమయంలో, ఇటువంటి నిర్ణయాలు అభివృద్ధి చెందుతున్న దేశాల అవకాశాలను దెబ్బతీస్తాయని తెలిపాయి. అసోసియేట్ సభ్యులపై ప్రభావం చూపే కీలక నిర్ణయాలను వారితో సంప్రదించిన తర్వాతే తీసుకోవాలని, లేదంటే అంతర్జాతీయ క్రికెట్ విశ్వసనీయత దెబ్బతింటుందని హెచ్చరించాయి. క్వాలిఫికేషన్ సైకిల్ మధ్యలో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఫార్మాట్లను మార్చడం వల్ల జట్ల ప్రణాళికలు దెబ్బతింటాయని, ఇప్పటికే పరిమిత వనరులతో పనిచేస్తున్న బోర్డులపై అదనపు ఆర్థిక, కార్యాచరణ భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి.
2027 వన్డే ప్రపంచకప్లో జట్ల సంఖ్యను 10 నుండి 14కి పెంచినప్పటికీ, గ్రూప్ స్టేజ్కు ముందు రౌండ్-రాబిన్ “సూపర్ సిరీస్” వంటి నాలుగు రౌండ్లను చేర్చారు. ఇందులో చివరి స్థానాల్లో ఉన్న జట్లలో ఒకటి త్వరగానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. టోర్నీకి ఇంకా 18 నెలల సమయం కూడా లేకపోవడంతో, చివరి నిమిషంలో చేసిన ఈ మార్పులు సభ్యదేశాలకు సర్దుబాటు చేసుకునే సమయం లేకుండా చేశాయని, అసోసియేట్ దేశాలతో విస్తృత భాగస్వామ్యంతో కూడిన పారదర్శక ప్రక్రియే క్వాలిఫికేషన్ మార్గాలపై నమ్మకాన్ని నిలబెడుతుందని స్పష్టం చేశాయి.