Reading Time: < 1 minute
Archana Kalpathi Appointees Tamil Nadu Devadaya Committee Cm Vijay
 తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదయింది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం కీలకమైన దేవాదాయ శాఖ పరిధిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన కమిటీలోకి ప్రముఖ మహిళా నిర్మాత అర్చన కల్పాత్తిని నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. హిందూ ధర్మాదాయ శాఖ పరిధిలోని ₹10 లక్షలకు పైగా వార్షిక ఆదాయం ఉన్న ప్రముఖ ఆలయాలకు పారంపర్యేతర (నాన్-హెరిడిటరీ) ట్రస్టీలను ఎంపిక చేసేందుకు ఒక అత్యున్నత స్థాయి రాష్ట్ర సమితిని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ ప్రతిష్టాత్మక కమిటీలో ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సి.ఇ.ఓ, ప్రముఖ సినీ నిర్మాత అర్చన కల్పాత్తికి సభ్యురాలిగా చోటు దక్కింది. ఈ కమిటీకి మైలం బొమ్మపురం అధీనం శ్రీ శివజ్ఞాన బాలయ్యా స్వామి ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి వైస్ ఛైర్మన్‌గా, అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించనున్నారు. అలాంటి కమిటీలో ఒక సినీ రంగానికి చెందిన మహిళా ప్రొడ్యూసర్‌ను భాగస్వామ్యం చేయడం ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అర్చన కల్పాత్తి నేతృత్వంలోని ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గతంలో విజయ్ కథానాయకుడిగా నటించిన భారీ బడ్జెట్ చిత్రాలు ‘బిగిల్’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)’లను నిర్మించింది. కంప్యూటర్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అర్చన, తమిళనాడువ్యాప్తంగా మల్టీప్లెక్స్ థియేటర్లను సైతం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. గతంలో కూడా విజయ్ తన చివరి చిత్రంగా భావిస్తున్న ‘జననాయగన్’ నిర్మించిన వెంకట్ కె. నారాయణను ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన విషయం తెలిసిందే. అలాగే విజయ్ మాజీ మేనేజర్, ప్రసిద్ధ ‘ది రౌట్’ సెలబ్రిటీ మేనేజ్‌మెంట్ అధినేత జగదీష్ పళనిస్వామిని ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శిగా (ప్రైవేట్ సెక్రటరీ) బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయ పాలకమండళ్ల నియమకాల కమిటీలోకి అర్చన కల్పాత్తికి పదవి దక్కడంతో, విజయ్ సర్కార్‌లో సినీ ప్రముఖులకు దక్కుతున్న ప్రాధాన్యతపై తమిళనాడు అంతటా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.