Reading Time: < 1 minute
నటి పై నిర్మాత లైంగిక దాడి.. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపికి..

బాలీవుడ్‌లో నిర్మాత, దర్శకుడు శకీల్ నూరానీ పై అత్యాచారం, బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌కు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి. ఓ యువ నటి, స్క్రీన్‌రైటర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ముంబైలోని మల్వానీ పోలీసులు.. సుమారు 40 రోజులుగా పరారీలో ఉన్న నూరానీని మహాబలేశ్వర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. ఆగస్టు 12 వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. నాలుగేళ్ల క్రితం సినిమా స్క్రిప్ట్‌ గురించి చర్చించాలంటూ నూరానీ తన మల్వానీ నివాసానికి ఆమెను పిలిచినట్లు ఆరోపించింది. అక్కడ తన పానీయంలో మత్తు పదార్థం కలిపి, అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పేర్కొంది. స్పృహలోకి వచ్చిన తర్వాత నూరానీ తన ఫోన్‌లో లైంగిక దాడికి సంబంధించిన వీడియో చూపించి బెదిరించినట్లు ఫిర్యాదులో ఆరోపించింది.పోలీసులను ఆశ్రయించినా, కుటుంబ సభ్యులకు విషయం చెప్పినా వీడియోను సోషల్ మీడియాలో, ఇతరులకు పంపిస్తానంటూ నూరానీ బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది. అంతటితో ఆగకుండా.. ఆ వీడియోను అడ్డుపెట్టుకుని తనను పలుమార్లు బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే లైంగిక దాడుల అనంతరం తనకు గర్భనిరోధక మాత్రలు పదేపదే ఇచ్చేవాడని కూడా ఆరోపించింది.

ఈ ఆరోపణలపై మల్వానీ పోలీసులు BNS సెక్షన్‌ 64(2)(m) (అత్యాచారం), 123 (విషపూరిత పదార్థం ద్వారా గాయపరచడం), 351(2) (క్రిమినల్‌ ఇంటిమిడేషన్‌), 88 (గర్భస్రావానికి కారణం కావడం) కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైన తర్వాత నూరానీ పోలీసులకు చిక్కకుండా పరారయ్యాడని పోలీసులు తెలిపారు. అతడి ఆచూకీ కోసం ముంబైలోని లోఖండ్‌వాలాలో ఉన్న అతడి కుమారుడి ఇంట్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించినా.. నూరానీ కనిపించలేదు.

టెక్నికల్‌ ఎవిడెన్స్ ఆధారంగా నూరానీ మహారాష్ట్రలోని సతారా జిల్లా మెధా ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మల్వానీ పోలీసుల బృందం అక్కడికి చేరుకుని స్థానిక పోలీసుల సహకారంతో అతడిని అదుపులోకి తీసుకుంది. అనంతరం ముంబైకి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించడంతో పాటు.. ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.