
లాభదాయకమైన ఉద్యోగాల పేరుతో థాయ్లాండ్ వెళ్లి ఆపై మయన్మార్ సరిహద్దులకేసి సైబర్ స్కామ్ ముఠాల చేతుల్లో చిక్కుకుంటున్న తెలుగు యువకుల పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కొంతమంది తెలుగు విద్యార్థులు తాము బ్యాంకాక్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమను బలవంతంగా మయన్మార్ తరలించి సైబర్ నేరాలకు పాల్పడేలా వేధిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆర్తిని వెళ్లబోసుకున్నారు. ఈ విషయంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారిని సురక్షితంగా మాతృభూమికి రప్పిస్తామని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హామీ ఇచ్చారు.
ఈ అంతర్జాతీయ ఉపాధి మోసాల ముఠాల నుంచి యువతను రక్షించేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ , బ్యాంకాక్లోని భారత రాయబార కార్యాలయం, ఏపీ ఎన్ఆర్టీ సంస్థలతో ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోంది. ఆగ్నేయాసియా దేశాలలోని సైబర్ ముఠాల బారినపడి ఏపీ, తెలంగాణలకు చెందిన పదుల సంఖ్యలో యువకులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని, భారత విదేశాంగ శాఖ సాయంతో ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు వేగవంతం చేసింది.
I understand your distress and concern. I will take up the matter with the concerned authorities to ensure that all necessary assistance is provided for their safe return. @OfficeofNL will coordinate. https://t.co/vShQxru62t
— Lokesh Nara (@naralokesh) August 10, 2026
మోసపూరిత ఏజెంట్ల వలలో పడకుండా ఉండేందుకు APNRTS , ఓవర్సీస్ మ్యాన్పవర్ కార్పొరేషన్ (OMCAP) ద్వారా హెల్ప్లైన్లను (+91 863-2340678) అందుబాటులోకి తీసుకువచ్చారు. పర్యాటక వీసాలపై ఉద్యోగాలు ఆశించి విదేశాలకు వెళ్లవద్దని, ఉద్యోగ ఆఫర్ల ప్రామాణికతను చెక్ చేసుకున్న తర్వాతే వెళ్లాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతూ, చట్టపరంగా పూర్తి సహాయసహకారాలు అందిస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.