
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ల అర్హతలను సమీక్షించేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్స్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ (టీఈక్యూ) అప్లికేషన్లను పరిశీలించడానికి, ఫ్యాకల్టీ నిబంధనలను సవరించడానికి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీలో హైదరాబాద్ నిమ్స్కు చెందిన నెఫ్రాలజిస్ట్ ప్రొఫెసర్ గంగాధర్ తాడూరికి చోటు దక్కింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (పీజీఎంఈబీ) కు అందుతున్న ప్రొఫెసర్ల అర్హత దరఖాస్తులను ఈ కమిటీ పరిశీలిస్తుంది. మెడికల్ ఇనిస్టిట్యూషన్స్ (క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఫ్యాకల్టీ) రెగ్యులేషన్స్-–2025 రూల్స్ సమీక్షించి, అవసరమైన సవరణలను సూచిస్తుంది. ఈ కమిటీలో డాక్టర్ గంగాధర్తో పాటు కమిటీ చైర్మన్గా డాక్టర్ విజయ్ ఓజా, సభ్యులుగా పుణెలోని భారతి విద్యాపీఠ్ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వివేక్ ఏ సావ్జీ ఉన్నారు.