Reading Time: 2 minutes
Suryapet Constable Arrested Double Murder Mothe Couple

అతనో కానిస్టేబుల్.. ఇద్దరిని మర్డర్ చేశాడు… అంతకు ముందు వారితోనే గుంతలు తీయించి.. అదే గుంతల్లో వారిని పూడ్చిపెట్టాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతెలో జరిగింది. ఆ కానిస్టేబుల్‌కు దంపతులకు మధ్య ఉన్న వైరమేంటి? ఎందుకు వారిద్దరినీ అంత దారుణంగా హతమార్చాడు? చనిపోయిన మహిళకు.. కానిస్టేబుల్‌కు మధ్య ఉన్న అనైతిక బంధమే కారణమా?

అది సూర్యాపేట జిల్లా మోతె మండలం. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న దంపతుల పేర్లు హలావత్ నాగులు, బూబా. వీరిద్దరూ మోతె మండలంలోని బిక్యా తండాలో నివాసం ఉంటున్నారు. నాలుగేళ్లుగా మోతెకు చెందిన రైతు అమృత రెడ్డి భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. వీరిద్దరూ ఉన్నట్టుండి మంగళవారం రాత్రి అదృశ్యమయ్యారు. బుధవారం ఉదయం కూలి పనులకు వెళ్తున్న మహిళలు రోడ్డు పక్కన గుంతలో నుంచి మహిళ కాలు బయటకు కనిపించడంతో హడలిపోయారు. అక్కడే ఉన్న రైతులకు సమాచారం అందించారు. వారు మోతె పోలీసులకు సమాచారం అందించడంతో దంపతుల దారుణ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అక్కడ క్లూస్ సేకరిస్తుండగా మహిళను పాతిపెట్టిన చోటుకు కొద్ది దూరంలోనే మరొకరిని పూడ్చిపెట్టినట్లు గుర్తించారు. దీంతో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రప్పించి రెండు డెడ్‌బాడీలను బయటకు తీశారు.

దంపతులు రాత్రికి రాత్యే దారుణంగా హత్యకు గురికావడం మండలంలో తీవ్రకలకలం రేపింది. భార్యాభర్తలను తలపై కొట్టిన గాయాలను గుర్తించారు పోలీసులు. ఇద్దరికీ తల వెనక భాగంలో తీవ్రగాయాలు కావడంతో అధిక రక్తస్రావమై దంపతులిద్దరూ చనిపోయినట్లు గుర్తించారు. చనిపోయిన అనంతరం వారిద్దరిని వేరువేరుగా గుంతల్లో పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. సాధారణంగా వీరిద్దరూ తమ రెండు ఆవులను వ్యవసాయ పొలంలో కట్టేసి ఇంటికి వస్తారు. మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఈ దంపతులు వారి ఆవులను పోలానికి తీసుకు వెళుతున్న సీసీ ఫుటేజ్ ను మోతె పోలీసులు గుర్తించారు. అలా వెళ్లిన దంతులు మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు.

దంపతులను దారుణంగా హత్య చేసింది మోతె పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ షరీఫ్‌గా తేలింది. కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు దారితీసిన పరిస్దితులపై విచారణ చేస్తున్నారు. షరీఫ్‌కు మరో వ్యక్తి సహాకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షరీఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. షరీఫ్‌కు.. హలవత్ నాగులు, బూబాలతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత క్రమంగా షరీఫ్.. బూబాతో వివాహేతర బంధం పెట్టుకున్నాడు. ఈక్రమంలోనే షరీఫ్‌కు పెళ్లి కుదరడంతో…. వారి మధ్య రూ. 3 లక్షలకు సంబంధించి ఆర్థిక లావాదేవీల కారణంగా వివాదం ఏర్పడింది. ఓ వైపు అనైతిక బంధం.. మరోవైపు తనను డబ్బులు డిమాండ్ చేయడంతో విసిగిపోయిన షరీఫ్.. వారిద్దరినీ చంపేయాలని డిసైడయ్యాడు. ఇందుకోసం పక్కా ప్లాన్ రెడీ చేశాడు.

తన ప్లాన్‌లో భాగంగా.. హలవత్ నాగులు, బూబాలను మరో వ్యక్తి సహాయంతో గుంతలు తీయాలనే కారణంతో పిలిపించాడు. అర్థరాత్రి గుంతలు తీస్తుండగా కానిస్టేబుల్ షరీఫ్ వారిద్దరిని తల వెనక భాగంలో బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై వారిద్దరు చనిపోయారు. దీంతో దంపతులిద్దరినీ వాళ్లు తీసిన గుంతలోనే పూడ్చిపెట్టాడు. ఈ మొత్తం వ్యవహారంలో కానిస్టేబుల్ షరీఫ్‌కు సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.