
రాష్ట్రంలో మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. బుధవారం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఒక గ్రామంలో చంద్రబాబు అనే పేరు కలిగిన వ్యక్తి, జగన్ అనే పేరు కలిగిన వ్యక్తిపై విజయం సాధించారు. ఈ ఆసక్తికర పరిణామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం, గుండ్లరేవు గ్రామంలో చోటు చేసుకుంది. గుండ్లరేవు గ్రామంలో మూడో దశలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. భూక్యా చంద్రబాబు, బానోత్ జగన్నాథం అలియాస్ జగన్ ఇద్దరు వ్యక్తులు పోటీ చేశారు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల మద్దతుతో బరిలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల పేర్లతో వీరి పేర్లు ఉండటంతో గ్రామంలో ప్రచారం కూడా ఆసక్తికరంగా జరిగింది. వారి ప్రచారం కూడా చంద్రబాబు, జగన్ పేర్లతోనే ఎక్కువగా సాగింది. పోలింగ్లో బానోత్ జగన్పై భూక్యా చంద్రబాబు విజయం సాధించారు. దీంతో ‘జగన్పై చంద్రబాబు విజయం’ అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు వెల్లువెత్తాయి.