
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది. మిస్టర్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోని లేకుండా బరిలోకి దిగిన చెన్నై జట్టు.. అన్ని విభాగాల్లోనూ అట్టర్ ప్లాప్ అయ్యింది. భారీ అంచనాలతో జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్, గత కొన్ని సీజన్లుగా బ్యాటింగ్ భారాన్ని మోస్తున్న రుతురాజ్ గైక్వాడ్తో పాటు యంగ్ సెన్సేషన్ ఆయూష్ మాట్రే, శివమ్ దూబే కూడా నిరాశపరిచారు. ఈ మ్యాచ్లో సీఎస్కే కేవలం 127 పరుగులకే ఆలౌట్ కాగా, రాజస్థాన్ రాయల్స్ 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఈ ఓటమి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ధోని ఉండి ఉంటే పరిస్థితి మారేదా అనే ప్రశ్నకు, గత రెండు మూడు సీజన్లుగా చెన్నై ఆటతీరు ఇలాగే ఉందని, ధోని ఉన్నా కూడా పరిస్థితి మారేది కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత సీజన్లో తొలి ఆరు మ్యాచ్లలో ఐదు పరాజయాలు చవిచూడగా.. 10వ స్థానంలో నిలిచిన సీఎస్కే, ఈ సీజన్లో కూడా చివరి స్థానానికి పరిమితం అయ్యేలా కనిపిస్తుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరాజయంపై మ్యాచ్ అనంతరం రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. రాజస్థాన్ బౌలర్లు కచ్చితత్వమైన బంతులు వేసి తమ పతనాన్ని శాసించారని అన్నాడు. ఈ ఓటమిపై పెద్దగా నిరాశ లేదని, ఆరంభంలో పిచ్ చాలా కఠినంగా ఉందని గైక్వాడ్ పేర్కొన్నాడు. జోఫ్రా ఆర్చర్, బర్గర్ లాంటి బౌలర్లను ఎదుర్కోవడం సవాలుగా మారిందని, వారు అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్తో బంతులు వేశారని ప్రశంసించాడు. తమ బ్యాటింగ్ కాస్త మెరుగుపడాల్సిన అవసరం ఉందని, కనీసం 150 నుంచి 160 పరుగులు చేసి ఉంటే గట్టి పోటీ ఇచ్చేవాళ్లమని అభిప్రాయపడ్డాడు.
అయితే ఇది తొలి మ్యాచ్ మాత్రమే కాబట్టి, ఈ సీజన్లో ముందుకు సాగేందుకు ఇంకా సమయం ఉందని గైక్వాడ్ ధీమా వ్యక్తం చేశాడు. మిగతా మ్యాచ్ల్లో మెరుగ్గా రాణించేందుకు అన్ని విధాలుగా సిద్ధమవుతామని తెలిపాడు. ఈ పరాజయాన్ని ఇక్కడే వదిలేసి ముందుకు సాగాలని, మరో మూడు రోజుల్లో తమకు మ్యాచ్ ఉందని, అందరూ సానుకూల దృక్పధంతో ఉండేలా చూసుకోవాలని జట్టు సభ్యులకు సూచించాడు. ఇక నుంచి ఆట మెరుగవుతుందని ఆశిస్తున్నట్లు గైక్వాడ్ తెలిపాడు. సూర్యవంశీ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం అతను ఓ మంచి బ్యాటర్గా ఎదుగుతున్నాడని, అతనికి మంచి భవిష్యత్తు ఉందని గైక్వాడ్ పేర్కొన్నాడు. సూర్యవంశీని ఆరంభంలోనే అవుట్ చేసి ఉంటే మ్యాచ్ టైట్గా ముగిసి ఉండేదని, తద్వారా నెట్ రన్ రేట్ కోల్పోయి ఉండేవాళ్ళం కాదని రుతురాజ్ గైక్వాడ్ అభిప్రాయపడ్డాడు.
మరిన్ని ఐపీఎల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..