Reading Time: < 1 minute
కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రూల్స్‌..! రూ.50 వేలు దాటితే TDS కటింగ్‌?

వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపుల విషయంలో ఆదాయపు పన్ను శాఖ కీలక స్పష్టతను ఇచ్చింది. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ 1949 పరిధిలోకి వచ్చే బ్యాంకింగ్ కంపెనీలు నిర్దేశిత పరిమితిని మించిన వడ్డీ ఆదాయంపై తప్పనిసరిగా టీడీఎస్ (TDS) మినహాయించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు తాజా మార్గదర్శకాలను సోషల్ మీడియా వేదిక ద్వారా విడుదల చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లేదా పోస్టాఫీస్ డిపాజిట్ల ద్వారా పొందే వడ్డీ ఆదాయం సాధారణ పౌరులకు రూ.50,000ను, సీనియర్ సిటిజన్లకు రూ.1 లక్షను మించినప్పుడు మాత్రమే TDS అమల్లోకి వస్తుంది.

ఈ పరిమితికి లోబడే మొత్తాలపై పన్ను మినహాయింపు అవసరం లేదు. కొత్తగా ప్రవేశపెట్టిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌ 2025 లోని సెక్షన్ 402 ప్రకారం బ్యాంకింగ్ కంపెనీ నిర్వచనాన్ని మరింత స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిర్వచనం ప్రకారం.. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ వర్తించే కంపెనీలతో పాటు, ఆ చట్టంలోని సెక్షన్ 51 కింద పేర్కొన్న బ్యాంకులు, బ్యాంకింగ్ సంస్థలు కూడా ఈ పరిధిలోకి వస్తాయి. అంటే ప్రత్యేకంగా పేర్కొనకపోయినా, ఈ సంస్థలు కూడా TDS నిబంధనలను అనుసరించాల్సిందేనని శాఖ స్పష్టం చేసింది.

అయితే సెక్షన్‌ 393(1) కింద నిర్దేశించిన పరిమితికి లోబడే వడ్డీ ఆదాయంపై బ్యాంకులు లేదా సంబంధిత సంస్థలు TDS మినహాయించాల్సిన అవసరం లేదని కూడా క్లారిటీ ఇచ్చింది. దీంతో చిన్న మొత్తాల డిపాజిటర్లకు ఉపశమనం లభించనుంది. ఈ మార్గదర్శకాలు బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, డిపాజిటర్లకు స్పష్టతనిస్తూ, పన్ను అమలు ప్రక్రియను సులభతరం చేసే దిశగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వడ్డీ ఆదాయంపై పన్ను లెక్కింపులో ఏర్పడే సందేహాలను తొలగించడంలో ఇవి సహాయపడనున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి