Reading Time: < 1 minute
Messi Event Manager Satadru Datta Arrested Kolkata

Lionel Messi: కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో శనివారం మధ్యాహ్నం అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీని సత్కరించే కార్యక్రమంలో పెద్ద గందరగోళం చెలరేగింది. ఈ కార్యక్రమంలో మెస్సీని చూడటానికి వేలాది మంది అభిమానులు గుమిగూడారు. కానీ వాళ్లు ఈ ఫుట్‌బాల్ స్టార్‌ను కనీసం చూడలేకపోవడంతో స్టేడియంలో పెద్ద గందరగోళం మొదలైంది. తమ అభిమాన స్టార్‌ను కలవ లేకపోవడంతో అభిమానులు కోపంతో స్టేడియంలో కుర్చీలు, వాటర్ బాటిల్స్ విసిరి పెద్ద గొడవ సృష్టించారు.

READ ALSO: Shivraj Singh Chouhan: ఐఎస్ఐ నిఘాలో కేంద్ర మంత్రి.. భద్రత మరింత కట్టుదిట్టం

ఈ సందర్భంగా పలువురు అభిమానులు మాట్లాడుతూ.. కేవలం మెస్సీని చూడటానికి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చు చేసి టిక్కెట్లు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. అయినప్పటికీ తాము తమ అభిమాన ఆటగాడిని ఒక్కసారి కూడా చూడలేకపోయినట్లు తెలిపారు. స్టేడియంలో చెలరేగిన గందరగోళం తర్వాత ఈవెంట్ నిర్వాహకుడు సతద్రు దత్తాను అరెస్టు చేసినట్లు లా అండ్ ఆర్డర్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఎడిజి) జావేద్ షమీమ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అన్నారు.

14 ఏళ్ల తర్వాత మెస్సీ భారతదేశానికి వచ్చారు. ప్రస్తుతం ఈ ఫుట్‌బాల్ స్టార్ “గోట్ ఇండియా టూర్ 2025″లో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా ఆయన మొదట సందర్శించిన రాష్ట్రం పశ్చిమబెంగాల్, అక్కడ అభిమానులు గొడవ సృష్టించిన తర్వాత ఈ టూర్ ఈవెంట్ మేనేజర్ సతద్రు దత్తాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సతద్రు దత్తా “ఎ సతద్రు దత్త ఇనిషియేటివ్” బ్యానర్ కింద పని చేస్తున్నారు. ఆయన గతంలో పీలే, డియెగో మారడోనా, కాఫు వంటి దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారులతో భారతదేశంలో ఈవెంట్‌లు నిర్వహించారు. తాజాగా ఆయన కోల్‌కతాలోనే కాకుండా వివిధ నగరాల్లో మెస్సీ పర్యటనలను నిర్వహిస్తున్నారు. కోల్‌కతా తర్వాత, మెస్సీ హైదరాబాద్, ముంబై, ఢిల్లీలను సందర్శించనున్నారు.

READ ALSO: Pankaj Chaudhary: యోగి అడ్డాలో బీజేపీకి కొత్త దళపతి..