
కోల్కతా: వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాల సరళిపై ఆ రాష్ట్ర సీఎం, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ స్పందించారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి టీఎంసీ కార్యకర్తలు ఎవరూ బయటకు వెళ్లొద్దని.. ఈ ఎన్నికల్లో టీఎంసీ గెలవబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు కేవలం 2 నుంచి 4 రౌండ్ల లెక్కింపే జరిగిందని.. చాలా చోట్ల 14 నుంచి 18 రౌండ్ల కౌంటింగ్ జరగాల్సి ఉందన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి టీఎంసీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎర్లీ ట్రెండ్స్ చూసి కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
పథకం ప్రకారమే బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు చూపుతున్నారని.. చాలా చోట్ల ఓట్ల లెక్కింపు ఆపేశారని ఆరోపించారు. టీఎంసీ వందకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నా అధికారులు ప్రకటించడం లేదని.. అన్ని తప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. టీఎంసీ నేతలను కేంద్ర బలగాలు వేధిస్తున్నాయని.. కేంద్ర బలగాలు ఈసీతో కలిసి పని చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపులో ఈసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని అన్నారు.
బెంగాల్ గడ్డపై కాషాయ రెపరెపలు
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ వెస్ట్ బెంగాల్లో బీజేపీ దూసుకుపోతుంది. 15 ఏళ్ల టీఎంసీ పాలనకు బ్రేకులు వేస్తూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమలం పార్టీ సత్తా చాటుతోంది. ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 195 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార టీఎంసీ 95 స్థానాలతో వెనకబడిపోయింది. బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 147 సీట్లు అవసరం. ఈ మ్యాజిక్ ఫిగర్ను బీజేపీ ఇప్పటికే క్రాస్ చేసి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. చివరి వరకు ఇదే ట్రెండ్ కొనసాగితే బెంగాల్ గడ్డపై తొలిసారి కాషాయ జెండా రెపరెపలాడనుంది.