Reading Time: < 1 minute

వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో సంచలనం: ఫల్తా నియోజకవర్గంలో రీ పోలింగ్‎కు ఈసీ ఆదేశం 

Caption of Image.

కోల్‎కతా: వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్తా నియోజకవర్గంలో రీ పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. పోలింగ్ ప్రక్రియ సందర్భంగా తీవ్రమైన ఎన్నికల నేరాలు, ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగినట్లు గుర్తించిన ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2026, మే 21న ఫల్తా నియోజకవర్గంలో రీ పోలింగ్, మే 24న కౌంటింగ్ నిర్వహించాలని బెంగాల్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఈసీఐ ఆదేశించింది.

కాగా, పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల మేరకు ఇప్పటికే డైమండ్ హార్బర్, మగ్రాహట్ నియోజకవర్గాల్లోని 15 పోలింగ్ బూత్‎లలో రీ పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. పల్తా నియోజకవర్గంలో కూడా పోలింగ్ సందర్భంగా తీవ్ర అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. బీజేపీ ఫిర్యాదులను పరిశీలించిన ఈసీ పల్తా నియోజకవర్గంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. 

ఇందులో భాగంగానే పల్తా నియోజకవర్గంలోని మొత్తం బూత్‎ల్లో రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ ఆదేశించింది. ఫల్తా నియోజకవర్గంలో మొత్తం 285 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈసీ ఆదేశాల మేరకు మొత్తం 285 పోలింగ్ బూత్‏లలో రీ పోలింగ్ జరగనుంది. కాగా, 2026, ఏప్రిల్ 23, 29న రెండు దశల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 2026, మే 4న కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్‎కు గంటల ముందే పల్తా నియోజకవర్గంలో రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ ఆదేశించడం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

►ALSO READ | బెంగాల్ లో పలుచోట్ల ఘర్షణలు.. కొన్ని చోట్ల మరోసారి రీపోలింగ్!

 

©️ VIL Media Pvt Ltd.