Reading Time: < 1 minute

ఉపాధి హామీ బిల్లును రద్దు చేయాలి: ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్

Caption of Image.

పద్మారావునగర్, వెలుగు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ డిమాండ్ చేశారు. ఎస్‌‌ఆర్‌‌ నగర్ డివిజన్​లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఇన్​చార్జి డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో ‘ఎంజీఎన్‌‌రేగా బచావో సంగ్రామ్ యాత్ర’ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. బాపునగర్ ప్రాంతంలో ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. సచిన్ సావంత్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.

కొత్త బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ పోరాటం చేస్తోందని, లోక్​సభలో ఎంపీలు నిరసనలు తెలుపుతున్నారన్నారు. డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ కోట్లాది గ్రామీణ పేదలకు చట్టబద్ధంగా లభిస్తున్న పనిహక్కును మోదీ ప్రభుత్వం హరించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. పనిదినాలు, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్, రవి కిరణ్ దేవులపల్లి పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.