
కలియుగ వైకుంఠం తిరుమలలో తుంబురు తీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహించారు. శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థంగా భాసిల్లుతున్న తుంబురు తీర్థ ముక్కోటిలో మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో 12 వేల మందికి పైగా భక్తులు పాల్గొని తీర్థ మార్చిస్నానాన్ని ఆచరించారని తెలిపింది టీటీడీ.
టీటీడీ విస్తృత ఏర్పాట్లు
టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదేశాల మేరకు అధికారులు తుంబురు తీర్థానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా మార్చి 31న ఉదయం 6 గంటల నుండి నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు భక్తులకు పంపిణీ చేశారు శ్రీవారి సేవకులు.
ఇంజినీంగ్ విభాగం ఆధ్వర్యంలో భక్తులు భోజనం చేసేందుకు వీలుగా అవసరమైన షెడ్లు, మార్గమధ్యంలో నిచ్చెనలు, తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులు, ఆస్తమా, స్థూల కాయం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారిని, 12 ఏళ్ల లోపు పిల్లలను తీర్థానికి అనుమతించలేదు అధికారులు.
పాప వినాశనం దగ్గర పార్కింగ్ సమస్య కారణంగా భక్తులను ఆర్టీసీ బస్సులలో మాత్రమే వెళ్లాలని సూచించారు అధికారులు. తుంబురు తీర్థానికి అటవీ మార్గంలో వెళ్ళే సమయంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రేడియో, బ్రాడ్కాస్టింగ్ విభాగం ఆధ్వర్యంలో నిరంతరాయంగా ప్రకటనలు చేసినట్లు తెలిపారు.
ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తుంబురు తీర్థం, పాపావినాశనం దగ్గర పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ అదనపు సిబ్బందిని నియమించామని… అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సేవలందించేందుకు అంబులెన్స్లను, పారామెడికల్ సిబ్బందిని అవసరమైన మందులు అందుబాటులో ఉంచామని తెలిపారు అధికారులు.
మరోవైపు టీటీడీ భద్రతా విభాగం, పోలీసులు, అటవీశాఖ సిబ్బంది కలసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు. టీటీడీ కల్పించిన అన్నప్రసాదాలు, తాగునీరు, ఇతర ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.