
అమరావతి: భోగాపురం విమానాశ్రయంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విమర్శలు మానుకోవాలని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. తన ఫేస్ బుక్ ఖాతాలో సోమిరెడ్డి పోస్టు చేశారు. ఎర్రబస్సు రాని ఊళ్లకు ఎయిర్ పోర్టు ఎందుకని గతంలో ఉతరాంధ్రను హేళన చేసి ఇప్పుడు మాట్లాడడం చూస్తుంటే జగన్ ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. జగన్ ఇలాగే వదిలేస్తే దేశాని స్వాతంత్య్రం తన తాతే తెచ్చారంటారేమో? అని దుయ్యబట్టారు. పోఖ్రాన్ అణుపరీక్షలు తమ కుటుంబ ఘనతేనని, ఆపరేషన్ సింధూర్ వెనుక తన వ్యూహాలు ఉన్నాయని కూడా చెబుతారని ధ్వజమెత్తారు. ఇలాంటి నేతలతో రాజకీయ నాయకులపై ప్రజలల్లో గౌరవం తగ్గుతుందన్నారు.