Reading Time: < 1 minute

హైదరాబాద్ బంజారాహిల్స్లో శ్మశానాన్ని గ్యాస్ గోదాం చేసేశారు.. బ్లాక్ దందా.. 414 సిలిండర్లు సీజ్

Caption of Image.

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్యాస్ కొరతను ఆసరా చేసుకుని అక్రమంగా సిలిండర్లను విక్రయిస్తున్న ముఠాను టాస్క్​​ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ కేంద్రంగా ‘మెట్రో గ్యాస్ ఏజెన్సీ’ నిర్వహిస్తున్న మహ్మద్ అమీర్ ఈ అక్రమ దందాకు ప్రధాన సూత్రధారి. 

ఇతడు బంజారాహిల్స్ నాగార్జున ఎక్స్ రోడ్ సమీపంలోని ఓ శ్మశాన వాటికను డంపింగ్ యార్డ్​గా మార్చుకున్నాడు. అక్కడ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేస్తూ, తన సిబ్బంది ద్వారా ఖాతాదారులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే భారీగా పెంచి విక్రయిస్తున్నాడు.

ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లే లక్ష్యంగా ఈ ముఠా అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో సోమవారం జూబ్లీహిల్స్ జోన్ టాస్క్​ఫోర్స్ బృందం, బంజారాహిల్స్ పోలీసులు కలిసి నిర్వహించిన దాడుల్లో రూ.21.88 లక్షల విలువైన 414 గ్యాస్ సిలిండర్లు, 10 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడితోపాటు డెలివరీ బాయ్స్, డ్రైవర్లు సహా మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

రూ.2 వేల సిలిండర్ ను రూ.6 వేలకు..
ఈ వ్యవహారంపై టాస్క్​​ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ స్పందిస్తూ రూ.2,100 ధర పలికే కమర్షియల్ సిలిండర్​ను ఈ ముఠా రూ.6 వేల వరకు అమ్ముతున్నట్లు వెల్లడించారు. దేశం, నగరంలో ఇంధన కొరత లేదని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.

©️ VIL Media Pvt Ltd.