
BJP Assam Manifesto 2026: అస్సాం అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. గౌహతిలోని అస్సాం బీజేపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేసిన మేనిఫెస్టోకు పార్టీ ‘సంకల్ప పత్రం’ అని పేరు పెట్టింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మ్యానిఫెస్టోలో ప్రజలకు వరాల జల్లులు కురిపించారు. రాష్ట్రంలో తాము తిరిగి అధికారంలోకి వస్తే ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని, భూ జిహాద్కు ముగింపు పలుకుతామని హామీ ఇచ్చారు. అస్సాంలో యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ని అమలు చేస్తామని, రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
READ MORE: Operation Kagar: నేటితో ముగుస్తున్న ‘కగార్’ డెడ్లైన్.. మావో శకం ముగిసినట్లేనా?
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు:
మౌలిక సదుపాయాలు: రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడి.
భూమి సంరక్షణ: బంగ్లాదేశీ మియాల (వలసదారులు) ఆక్రమణలో ఉన్న భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం.
చట్టాలు: రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code – UCC) అమలు చేయడం.
ఉపాధి: యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడం మరియు స్వదేశీ ప్రజల గౌరవ మర్యాదలను కాపాడటం.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రసంగించారు. ఆరవ షెడ్యూల్లో చేర్చబడిన ప్రాంతాలు, అలాగే షెడ్యూల్డ్ తెగలు నివసించే ప్రాంతాలు దీని నుంచి మినహాయిస్తామని స్పష్టం చేశారు. లవ్ జిహాద్పై కఠిన చర్యలు తీసుకుంటామని, అస్సాంను వరద రహిత రాష్ట్రంగా మార్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రెండేళ్లలో అస్సాంను వరద రహిత రాష్ట్రంగా మార్చేందుకు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాకు ఒక వైద్య కళాశాల, ఒక విశ్వవిద్యాలయం, ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. రాబోయే ఐదేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానని చెప్పారు. మరోవైపు.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. “గత 60 ఏళ్లలో కాంగ్రెస్ సాధించలేని మార్పును బీజేపీ కేవలం పదేళ్లలోనే సాధించి చూపించింది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై కాంగ్రెస్కు ఎప్పుడూ సరైన విజన్ లేదు” అని ఆమె ఆరోపించారు. ఒకప్పుడు అస్సాం యువత అవకాశాల కోసం వెతుక్కుంటూ బయటకు వెళ్లేవారని, ఇప్పుడు బీజేపీ పాలనలో పెరిగిన అవకాశాల వల్ల విదేశీ కెరీర్లను వదులుకుని మరీ సొంత రాష్ట్రానికి తిరిగి వస్తున్నారని ఆమె పేర్కొన్నారు.