
Explosion in Police Station: కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. గతంలో సీజ్ చేసి స్టేషన్లో నిల్వ ఉంచిన బాణసంచా సామగ్రిని కోర్టుకు తరలించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ పరిసరాలు దద్దరిల్లాయి. స్టేషన్ ఆవరణలో ఉన్న ఒక కారు కూడా ఈ ప్రమాదంలో పాక్షికంగా ధ్వంసమైంది.
ఈ దుర్ఘటనలో చల్లపల్లి ఎస్సై దుర్గాంజనేయులు, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లాతో పాటు మరో సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో కానిస్టేబుల్ అబ్దుల్లా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే మంగళగిరిలోని ఎన్నారై (NRI) ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే వారిని విజయవాడలోని కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించాలని అధికారులు భావిస్తున్నారు.
ఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు స్టేషన్ కు చేరుకుని నమూనాలను సేకరించారు. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలను విశ్లేషించేందుకు ఫోరెన్సిక్ బృందం విచారణ చేపట్టింది. సీజ్ చేసిన పేలుడు పదార్థాలను తరలించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించారా లేదా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Leander Paes: బెంగాల్ ఎన్నికల వేళ కీలక పరిణామం.. బీజేపీలో చేరిన లియాండర్ పేస్
చల్లపల్లి పోలీస్ స్టేషన్ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె కృష్ణా జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన పోలీసులకు అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందించాలని, ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా సీజ్ చేసిన పేలుడు పదార్థాల నిర్వహణపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని ఆమె కోరారు. ప్రస్తుతం చల్లపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.