Reading Time: 2 minutes
Ravindra Jadeja : జడ్డూని వదులుకున్న పాపానికి చెన్నైకి శాపం తగిలిందా? రాజస్థాన్ పింక్ జెర్సీలో రవీంద్రుడి విశ్వరూపం

Ravindra Jadeja : ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ఒక సంచలన ట్రేడ్ గురించిన చర్చ ఊపందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన ఆటగాళ్ల మార్పిడి ఇప్పుడు హాట్ టాపిక్. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వదులుకుని సంజూ శామ్సన్‌ను తెచ్చుకున్న చెన్నైకి, మొదటి మ్యాచ్‌లోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ట్రేడ్ వల్ల సీఎస్కేకు సుమారు రూ.2.58 కోట్ల మేర నష్టం వాటిల్లిందని విశ్లేషణలు చెబుతున్నాయి.

గతేడాది నవంబర్‌లో జరిగిన ట్రేడింగ్ ఒప్పందం ప్రకారం.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శామ్సన్‌ను రూ.18 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది. అదే సమయంలో చెన్నై స్టార్ రవీంద్ర జడేజాను రాజస్థాన్ తీసుకుంది. అయితే జడేజా ఫీజును రూ.18 కోట్ల నుంచి రూ.14 కోట్లకు తగ్గించి ఈ ఒప్పందం కుదిరింది. అంటే కాగితం మీద రాజస్థాన్ రూ.4 కోట్లు ఆదా చేసింది. కానీ మైదానంలో చూస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. సంజూ శామ్సన్ కేవలం 6 పరుగులు చేసి అవుట్ అవ్వగా, జడేజా 3 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీసి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఎంఎస్ ధోనీ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో, టీమ్ బాధ్యతను మోయాల్సిన సంజూ శామ్సన్ దారుణంగా విఫలమయ్యాడు. ఓపెనర్‌గా వచ్చిన అతను 7 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసి నండ్రే బర్గర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో సీఎస్కే పవర్‌ప్లేలో 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒక మ్యాచ్‌కు సంజూ ధర సుమారు రూ.1.28 కోట్లు అని లెక్కగడితే, అతను చేసిన ప్రదర్శన జట్టుకు రూ.1.81 కోట్ల మేర నష్టాన్ని మిగిల్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు తన పాత టీమ్ సీఎస్కేపై జడేజా విరుచుకుపడ్డాడు. క్రీజులో పాతుకుపోతున్న సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబేలను అవుట్ చేసి చెన్నై కోలుకోకుండా దెబ్బకొట్టాడు. జడేజా వేసిన స్పెల్ వల్ల రాజస్థాన్‌కు ఆ మ్యాచ్‌లో రూ.77 లక్షల మేర అదనపు విలువచేకూరిందని అంచనా. అంటే ఈ ఒక్క మ్యాచ్‌లోనే జడేజా ప్రదర్శన, శామ్సన్ వైఫల్యం మధ్య తేడా రూ.2.58 కోట్లు. ఈ డబ్బుతో సుమారు 188 రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‌లు లేదా 215 మ్యాక్ బుక్ ఎయిర్ ల్యాప్‌టాప్‌లు కొనవచ్చని సరదాగా పోలికలు పెడుతున్నారు.

కేవలం జడేజా బౌలింగ్ మాత్రమే కాదు, రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (15 బంతుల్లో 50) వీరవిహారం చేయడంతో చెన్నై నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ కేవలం 12.1 ఓవర్లలోనే ఊదేశింది. సీఎస్కే బ్యాటింగ్ ఆర్డర్ లో ఉన్న లోపాలు ఈ మ్యాచ్‌తో స్పష్టంగా బయటపడ్డాయి. జడేజా లాంటి ఫినిషర్, బౌలర్ లేకపోవడం జట్టు సమతూకాన్ని దెబ్బతీసిందని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఒక్క మ్యాచ్‌తో ట్రేడ్ ఫలితాన్ని తేల్చలేం కానీ, మొదటి రౌండ్‌లో మాత్రం హిట్‌మ్యాన్ జడేజాదే పైచేయి అని స్పష్టమవుతోంది.

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..