Reading Time: < 1 minute
Leander Paes Joins Bjp Ahead Of West Bengal Elections

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, సుకాంత మజుందార్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా లియాండర్ పేస్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. తాను ముఖ్యంగా క్రీడలు, యువత అభివృద్ధిపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. బెంగాల్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేశారు. 1986లో తన క్రీడా ప్రయాణం ప్రారంభించినప్పుడు అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. ప్రస్తుతం పరిస్థితులు మెరుగయ్యాయన్నారు. అయినా కూడా ఇంకా అభివృద్ధికి అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

లియాండర్ పేస్ చేరికపై సుకాంత మజుందార్ మాట్లాడుతూ.. బెంగాల్ బీజేపీకి ఇది పెద్ద బూస్ట్ అని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పేస్ ప్రచారం చేస్తారని తెలిపారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి గత 12 ఏళ్లుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలే పేస్‌ను ఆకర్షించాయని చెప్పారు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో పేస్ సాధించిన కాంస్య పతకం దేశానికి గర్వకారణమని కొనియాడారు.

టీఎంసీ నుంచి బీజేపీ వైపు
లియాండర్ పేస్ 2021లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. కానీ ఎప్పుడూ కూడా యాక్టివ్‌ కనిపించలేదు. ఇటీవల పార్టీ కార్యకలాపాల్లోనూ పెద్దగా పాత్ర లేకపోవడంతో భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మార్చి 24న కోల్‌కతాలో నితిన్ నబీన్‌ను కలిసిన తర్వాత బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తానికి మంగళవారం కమలం గూటికి చేరిపోయారు.

పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎన్నికలు ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.

ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరులో తెలంగాణ సాఫ్ట్‌వేర్ జంట ఆత్మహత్య.. కారణమిదేనా?

ఇది కూడా చదవండి: Inter Result: అంతులేని విషాదం.. ఇంటర్ ఫలితాలు విడుదల.. ప్రాణాలతో లేని ‘టాపర్’

ఇది కూడా చదవండి: IPS Couple Wedding: అప్పగింతల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చిన ఐపీఎస్ పెళ్లికూతురు అన్షికా వర్మ