
సీనియర్ నటి రాధికా ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘థాయ్ కిళవి’ (Thaai Kizhavi).. బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 2026లో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా నిలిచిన ఈ మూవీలో.. మంచంపై ఉండి కూడా కేవలం కళ్లతో, హావభావాలతో రాధిక పండించిన నటన సినిమాకు ప్రాణం పోశాయి. ఈ సినిమాను యంగ్ హీరో శివకార్తికేయన్ నిర్మించడం విశేషం. అంతే కాదు సినిమా భారీ లాభాలు పొందడంతో, శివకార్తికేయన్ రాధికకు రెమ్యునరేషన్తో పాటు లాభాల్లో కూడా వాటా ఇచ్చారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఒక సీనియర్ నటికి లాభాల్లో వాటా ఇవ్వడం ఇదే మొదటిసారి అని రాధిక స్వయంగా చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ బాట పట్టింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్స్టార్ (JioHotstar) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఏప్రిల్ 10, 2026 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఐఎండీబీ (IMDb)లో 8.1/10 రేటింగ్తో దూసుకుపోతున్న ఈ చిత్రం, ప్రస్తుతం కేవలం తమిళ ఆడియోతోనే అందుబాటులోకి రానుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే సిట్యుయేషనల్ కామెడీని ఇష్టపడే వారు ఈ సినిమాను అస్సలు మిస్ కావద్దు.
కథ ఏంటంటే..
70 ఏళ్ల వయసున్న పావునుతాయ్ (రాధికా శరత్కుమార్) అనే ఒక కరుడుగట్టిన వడ్డీ వ్యాపారి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఊరి జనాన్ని, తన ముగ్గురు కొడుకులను తన అదుపులో ఉంచుకునే ఈ మొండి మనిషికి అకస్మాత్తుగా పక్షవాతం వచ్చి మంచాన పడుతుంది. దీంతో ఆమె ఎప్పుడు చనిపోతుందా అని ఊరి జనం, ఆమె దాచిన ఆస్తి ఎక్కడ ఉందో అని కొడుకులు ఎదురుచూస్తుంటారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆమె, తన వేలితో ఒక రహస్యాన్ని చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఆ రహస్యం ఏంటి? ఆమె వద్ద ఉన్న ‘160 తులాల బంగారం’ వెనుక ఉన్న కథ ఏంటి? అనే అంశాలను దర్శకుడు శివకుమార్ మురుగేషన్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూనే, హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారు.