
Varanasi: సూపర్స్టార్ మహేష్ బాబు 50 ఏళ్లు పూర్తి చేసుకుని 51వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అభిమానులు భారీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈసారి బర్త్డే మరింత స్పెషల్ కావడానికి మరో కారణం ఉంది. మహేష్ బాబు – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో మహేష్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా మేజర్ అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే మేకర్స్ మాత్రం అభిమానుల అంచనాలకు భిన్నంగా కేవలం రెండు స్టిల్స్ను మాత్రమే విడుదల చేశారు. టీజర్, గ్లిమ్స్, మేకింగ్ వీడియో.. కనీసం షూటింగ్కు సంబంధించిన ప్రత్యేక వీడియో కూడా విడుదల చేయలేదు. దీంతో రాజమౌళి ఇలా ఎందుకు సైలెంట్గా ఉన్నారనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో, అభిమానుల్లో మొదలైంది.
ఒకప్పుడు రాజమౌళి సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యేది. కానీ ‘వారణాసి’ విషయంలో మాత్రం ప్రమోషన్స్ను చాలా కంట్రోల్డ్గా నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది. మహేష్ బాబు 50వ పుట్టినరోజు వంటి ప్రత్యేక సందర్భంలో కూడా కేవలం రెండు స్టిల్స్తోనే సరిపెట్టడం వెనుక జక్కన్నకు ప్రత్యేకమైన ప్లానింగ్ ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ‘వారణాసి’కి సంబంధించిన అనధికారిక కంటెంట్ మాత్రం సోషల్ మీడియాలో వరుసగా ప్రత్యక్షమవుతోంది. షూటింగ్ సెట్స్కు సంబంధించిన ఫొటోలు, యాక్షన్ సన్నివేశాల క్లిప్స్, సెట్స్ విజువల్స్ ఇలా ఏదో ఒక కంటెంట్ లీక్ అవుతూనే ఉంది. అధికారిక అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుంటే.. అనధికారిక కంటెంట్ మాత్రం ముందుగానే వారి ముందుకు వచ్చేస్తోంది. ఇది మేకర్స్కు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా లీకైన విజువల్స్ అధికారికంగా విడుదలయ్యే సమయానికి వాటిపై ప్రేక్షకుల్లో ఉన్న క్యూరియాసిటీ కొంత తగ్గే ప్రమాదం ఉంటుంది. అందుకే రాజమౌళి కావాలనే సినిమా కంటెంట్ను కఠినంగా కంట్రోల్ చేస్తున్నారా? లేక సినిమాలోని అసలు స్కేల్, విజువల్స్ను బయటపెట్టడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారా? అనే చర్చ సాగుతోంది.
రాజమౌళి సినిమాలకు హైప్ కొత్తేమీ కాదు. అయితే ‘వారణాసి’ లాంటి భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్కు హైప్ను ఎక్కువ కాలం కొనసాగించడం అసలు సవాలుగా మారింది. ఇప్పటివరకు విడుదలైన రెండు స్టిల్స్లో మహేష్ బాబును ఒకసారి రగ్గడ్ లుక్లో, మరోసారి ఆఫ్రికన్ బ్యాక్డ్రాప్లో చూపించారు. ఈ విజువల్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నప్పటికీ.. కథ, స్క్రీన్ప్లే, అసలు కాన్ఫ్లిక్ట్ వంటి అంశాలను మాత్రం మేకర్స్ ఇంకా మిస్టరీగానే ఉంచారు. ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. రిలీజ్కు ఇంకా సమయం ఉండటంతో ఇప్పుడే భారీగా ప్రమోషన్స్ మొదలుపెట్టకుండా క్రమంగా సినిమాపై ఆసక్తిని పెంచేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎక్కువ కాలం అప్డేట్స్ ఇవ్వకుండా సైలెంట్గా ఉంటే ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెట్టినట్టవుతుందనే చర్చ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా.. ‘వారణాసి’ విషయంలో రాజమౌళి మౌనం కూడా ఇప్పుడు ఒక ప్రమోషనల్ స్ట్రాటజీగా మారిపోయింది. అసలు ఈ సైలెన్స్ వెనుక జక్కన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? అన్నది మాత్రం రాబోయే అప్డేట్స్తోనే క్లారిటీ రానుంది.