
- వరంగల్ జిల్లా గీసుకొండలో 1,327 ఎకరాల్లో పార్కు నిర్మాణం
- ‘పీఎం మిత్ర’ స్కీమ్లో బ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసిన కేంద్రం
- రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రెండేండ్లుగా పనులు స్పీడప్
- రూ.1,695 కోట్ల వ్యయం.. 24 వేల మందికి ఉద్యోగావకాశాలు
- ఈ నెల 10న వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
వరంగల్, వెలుగు: వరంగల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల పరిధిలోని శాయంపేట వద్ద నిర్మించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కేఎంటీపీ) పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈ పార్క్ను వర్చువల్గా ప్రారంభించనున్నారు.
పదేండ్ల కింద శంకుస్థాపన జరిగిన ఈ టెక్స్టైల్ పార్క్ పనులు మొదట్లో స్లోగా జరిగాయి. దీంతో ఈ పార్క్ను కేంద్రం ‘ప్రధాన మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పెరల్ (పీఎం మిత్ర)’ పథకంలో భాగంగా బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసింది. తర్వాత కావాల్సిన నిధులు మంజూరు చేయడంతో పనులు స్పీడ్గా జరిగి ఓపెనింగ్కు సిద్ధమైంది.
2017లోనే శంకుస్థాపన
గీసుగొండ మండల కేంద్రంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కోసం 2016లో భూసేకరణ జరగ్గా..2017లో పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తంగా 1,327 ఎకరాల్లో కేఎంటీపీ నిర్మాణ పనులు చేపట్టారు. ఏడాదిలో ప్రాజెక్ట్ పనులు పూర్తిచేసి 60 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏండ్లు గడిచినా పనులు పూర్తి చేయకపోగా.. భూములు ఇచ్చిన రైతులు, స్థానికులకు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.
దీంతో రైతుల పలుమార్లు ధర్నాలు, నిరసనలకు దిగారు. కొన్ని రోజుల తర్వాత ఈ టెక్స్టైల్ పార్క్లో గణేశా ఎకో, యంగ్ వన్లాంటి కంపెనీలు ఏర్పాటైనా పెద్దగా ఉద్యోగావకాశాలు దక్కలేదు. అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఈ టెక్స్టైల్ పార్క్ కోసం పెద్దగా నిధులు కేటాయించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు.
‘పీఎం మిత్ర’ పథకంలో చేర్చిన కేంద్రం
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ‘పీఎం మిత్ర’ పథకం కింద రూ. 4,445 కోట్లతో దేశంలోని7 టెక్స్టైల్ పార్క్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీతోపాటు తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కు సైతం ఈ పథకం కింద ఎంపిక చేసింది.
‘5 ఎఫ్ విజన్’ కాన్సెప్ట్తో (ఫార్మ్, ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్) ప్రారంభించిన ఈ స్కీమ్లో బ్రౌన్ ఫీల్డ్ పార్క్ కింద కేఎంటీపీకి అవకాశం దక్కింది. గ్రీన్ ఫీల్డ్ పార్కులకు రూ.500 కోట్లు కేటాయించగా, బ్రౌన్ ఫీల్డ్ లిస్ట్లోఉన్న కేఎంటీపీ నిర్మాణ పనులకు కేంద్రం మొదటి దశలో రూ.200 కోట్లు కేటాయించింది. దీంతో పార్క్ నిర్మాణ పనులు స్పీడందుకున్నాయి.
రూ.1,695 కోట్లతో అభివృద్ధి పనులు
పార్క్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 1,327 ఎకరాలు కేటాయించడానికి తోడు కావాల్సిన అన్ని అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలో గడిచిన రెండేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ‘పీఎం మిత్ర’ ప్రాజెక్ట్లో భాగంగా పార్క్ ఏరియాలో కావాల్సిన అభివృద్ధి పనులు చేపట్టారు. పార్క్లోని 62 శాతం భూములను ఇప్పటికే పలు ఇండస్ట్రీలకు కేటాయించారు.
ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తోపాటు విశాలమైన రోడ్లు, వాటర్ సప్లై, పార్క్ ఏరియా మొత్తం వీధి దీపాలు ఏర్పాటు చేశారు. పార్కులోని కంపెనీలకు విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా 232/132/33 కేవీ పవర్ సబ్స్టేషన్లు, 220 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు వేశారు. నీటి సరఫరా కోసం 12 ఎంఎల్డీ సిస్టంను అందుబాటులోకి తెచ్చారు. ఫేజ్ వన్లో 5 ఎంఎల్డీ సీఈటీపీ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ట్రయల్ రన్లో ఉంది.
24 వేల మందికి ఉద్యోగావకాశాలు
కాకతీయ టెక్స్టైల్ పార్క్లో ఇప్పటికే ‘గణేశా ఎకో, యంగ్ వన్’ కంపెనీలు తమ ఉత్పత్తిని ప్రారంభించాయి. పిల్లలు, రెడీమేడ్ దుస్తుల్లో బ్రాండెడ్ కంపెనీగా భావించే కైటెక్స్ ఓపెనింగ్కు సిద్ధమ వుతోంది. కొన్ని నెలలుగా వందలాది మంది సిబ్బందికి శిక్షణ అందించడానికి తోడు ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో మొత్తం 24,400 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి.
ప్రస్తుతం 2 వేల మంది పనిచేస్తున్నారు. ఇప్పటికే రూ. 3,842 కోట్ల పెట్టుబడులు రాగా.. భవిష్యత్తులో రూ. 6 వేల కోట్ల వరకు పెట్టుబ డులు వస్తాయని అంచనా వేస్తున్నారు. పార్క్ పనులు చివరి దశకు చేరుకోవడంతో ప్రధాని చేతుల మీదుగా వర్చువల్గా ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు.