Reading Time: < 1 minute
Nishikant Dubey Shares Indira Gandhi Castro Pics To Counter Rahul Gandhis Hug Remark

BJP:  ప్రధాని నరేంద్ర మోడీ విదేశాంగ విధానంపై కాంగ్రెస్ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడుతోంది. విదేశీ నేతల్ని కౌగిలించుకోవడం ఎలాంటి విదేశాంగ విధానం అంటూ గురువారం రాహుల్ గాంధీ కామెంట్స్ చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఇందిరాగాంధీ వీడియోతో సమాధానం ఇచ్చారు. ఇందిరా గాంధీ, క్యూబా విప్లవనేత ఫిడెల్ కాస్ట్రో, పాలస్తీనా నాయకుడు యాసర్ అరాఫత్‌లను కౌగిలించుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదే కాకుండా, 8 ఏళ్ల క్రితం రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రధాని నరేంద్రమోడీని ఆలింగనం చేసుకున్న ఫోటోను కూడా దూబే పోస్ట్ చేశారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘రాహుల్ గాంధీ, మీరు ఎప్పుడు పరిణతి చెందుతారు?’’ అని ప్రశ్నించారు. ప్రధానిని అవమానించడం ద్వారా వరసగా మూడు సార్లు మోడీని ఎన్నుకున్న కోట్లాది మంది ఓటర్లను అవమానించారని జోషి అన్నారు. వంశపారంపర్య రాజకీయాలను ప్రజలు తిరస్కరించిన ప్రజల తీర్పును ప్రశ్నిస్తున్నారని అన్నారు.

గురువారం ఢిల్లీలో క్రియేటివ్ కాంగ్రెస్ జాతీయ సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. విదేశాంగ విధానం అంటే ప్రపంచ దేశాల నేతలను ఆలింగనం చేసుకోవడమే అన్న ఆలోచన ప్రధాని మోదీకి ఎక్కడి నుంచి వచ్చిందో తనకు అర్థం కావడం లేదని అన్నారు. వ్యంగ్యంగా కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్‌ను కౌగిలించుకున్నారు. సందీప్ దీక్షిత్ స్పందిస్తూ.. ‘‘మెలోని అనుకుని కౌగిలించుకోలేదుగా..?’’ అంటూ వ్యాఖ్యానించారు. దీనికి రాహుల్ గాంధీ నేను ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు అని సమాధానం ఇచ్చారు.

అయితే, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని ప్రస్తావించడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ రాహుల్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. ప్రతిపక్ష నేత చేయాల్సిన కామెంట్స్ కావని అన్నారు. ఆయన ఉపయోగించని భాష అసభ్యకరమైంది, అశ్లీలమైంది, అనుచితమైందిగా విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని ఎగతాళి చేస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరిణతిలో లోపాన్ని చూపిస్తున్నాయని బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ విమర్శించారు.