
Highest ODI Score on Birthday: పుట్టినరోజు అంటే ఎవరైనా కేక్ కోసి సంబరాలు చేసుకుంటారు. అయితే, ఈ క్రికెటర్ల విషయానికి వస్తే మాత్రం మ్యాటర్ మరోలా ఉంటుందండోయ్. ఈ దిగ్గజాలు మాత్రం బ్యాట్తో మైదానంలో పరుగుల సునామీ సృష్టించి తమ పుట్టినరోజును చరిత్ర పుటల్లో లిఖించుకున్నారన్నమాట. తాజాగా అఫ్గానిస్తాన్ సంచలనం సెదిఖుల్లా అటల్ ఏకంగా సచిన్, టామ్ లాథమ్ రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆ అరుదైన మైలురాళ్ల విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.
బెల్ఫాస్ట్లో అటల్ విధ్వంసం.. వన్డేల్లో సరికొత్త ప్రపంచ రికార్డు..!
అఫ్గానిస్తాన్ యువ ఓపెనర్ సెదిఖుల్లా అటల్ తన 25వ పుట్టినరోజును చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. ఐర్లాండ్తో జరిగిన వన్డే పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 120 బంతుల్లోనే 17 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో ఏకంగా 143 పరుగులు బాది ఔరా అనిపించాడు.
గతంలో న్యూజిలాండ్ ఆటగాడు టామ్ లాథమ్ పేరిట ఉన్న 140 పరుగుల రికార్డును అటల్ అధిగమించాడు. పుట్టినరోజున అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇబ్రహీం జద్రాన్తో కలిసి రెండో వికెట్కు ఏకంగా 231 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు కొండంత స్కోరు అందించాడు.
సచిన్ ‘డెజర్ట్ స్టార్మ్’.. షార్జాలో కంగారూలకు చుక్కలు..
పుట్టినరోజు సెంచరీల ప్రస్తావన వస్తే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఆడిన ఆ చారిత్రక ఇన్నింగ్స్ ముందుగా గుర్తుకొస్తుంది. సరిగ్గా 1998 ఏప్రిల్ 24న తన 25వ పడిలోకి అడుగుపెట్టిన వేళ.. షార్జా మైదానంలో ఆస్ట్రేలియాపై సచిన్ సాగించిన దండయాత్ర క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయింది.
ఆస్ట్రేలియా నిర్దేశించిన 273 పరుగుల లక్ష్య ఛేదనలో 131 బంతుల్లోనే 134 పరుగులు సాధించి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు. కంగారూ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన ఆ ఇన్నింగ్స్ భారత అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఈడెన్ గార్డెన్స్లో కింగ్ కోహ్లీ.. పుట్టినరోజున 49వ శతకం..
భారత రన్మెషీన్ విరాట్ కోహ్లీ 2023 ప్రపంచకప్లో సృష్టించిన అద్భుతం ఎప్పటికీ మరపురానిది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తన 35వ జన్మదినం నాడు దక్షిణాఫ్రికాపై కోహ్లీ అజేయంగా 101 పరుగులు సాధించాడు.
లక్షలాది మంది ప్రేక్షకుల కేరింతల మధ్య సచిన్ పేరిట ఉన్న 49 వన్డే శతకాల రికార్డును సమం చేస్తూ ఆ రోజు కోహ్లీ బ్యాట్ ఝుళిపించిన తీరు అభిమానులను కట్టిపడేసింది. ఈ మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించడంతో కోహ్లీ పుట్టినరోజు మరింత ప్రత్యేకంగా మారింది.
ఆరంభించిన కాంబ్లీ.. టీ20ల్లో వార్నర్ పటాకా..!
పుట్టినరోజున వన్డేల్లో సెంచరీ సాధించిన మొదటి క్రికెటర్గా భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ నిలిచాడు. 1993లో ఇంగ్లండ్పై జైపూర్ వేదికగా తన 21వ పుట్టినరోజున అజేయంగా 100 పరుగులు చేసి ఈ అరుదైన సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు.
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం 2019లో తన 33వ పుట్టినరోజున శ్రీలంకపై కేవలం 56 బంతుల్లోనే 100 పరుగులు బాది టీ20 ఫార్మాట్లో సరికొత్త మైలురాయి అందుకున్నాడు. అంతకుముందు టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ లెజెండ్ పాట్సీ హెండ్రెన్ 1930లో తన 41వ పుట్టినరోజున వెస్టిండీస్పై ఏకంగా 205 పరుగులతో డబుల్ సెంచరీ బాదడం విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..