
- ఈ-మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ భూకేటాయింపుల్లో పూర్తి పారదర్శకత: కాంగ్రెస్ ఎంపీలు
- సీఎం రేవంత్రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించేలా కేటీఆర్, హరీశ్రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: రావిర్యాల–-మహేశ్వరం ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో భూకేటాయింపులు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం పార్లమెంట్ నిరవధిక వాయిదా తర్వాత తెలంగాణ భవన్లో ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్రెడ్డి, చామల కిరణ్కుమార్రెడ్డి, సురేష్ షెట్కార్, అనిల్ కుమార్ యాదవ్, రామసహాయం రఘురాం రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు.
ఈ-మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ భూకేటాయింపులపై కేటీఆర్ చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.89 లక్షలకే భూములు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ.1.50 కోట్ల చొప్పున కేటాయించి ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ ఆదాయం తెచ్చిందన్నారు. టెస్సరాక్ట్ కంపెనీతో సీఎం సోదరుడు కొండల్రెడ్డికి, ఆయన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని, కంపెనీలో ఒక్క షేర్ కూడా లేదని స్పష్టం చేశారు.
సభను వాయిదా వేసి పారిపోయారు..
నీట్ అవకతవకలు, నిరుద్యోగం, కరువు, ఈశాన్య రాష్ట్రాల వరదలపై చర్చించకుండా వందేమాతరం పూర్తవగానే పార్లమెంట్ను వాయిదా వేశారని ఎంపీ వేం నరేందర్రెడ్డి విమర్శించారు. 19 రోజుల సమావేశాల్లో ప్రజా సమస్యలపై సరైన చర్చ జరగలేదన్నారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు కేంద్రం భయపడుతోందని ఆరోపించారు. దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వ తీరును గమనిస్తున్నారని అన్నారు.