Reading Time: < 1 minute
Kphb Woman Suicide Sons Drug Addiction Family Tragedy

Hyderabad: నవమాసాలు మోసి, కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచిన బిడ్డలే తన బ్రతుకును నరకప్రాయం చేస్తారని ఆ తల్లి ఏనాడూ ఊహించి ఉండదు. రెక్కల కష్టం ధారపోసి, కడుపు కట్టుకుని పెద్ద చేసిన కుమారులు చేతికి అందివచ్చి తనకు ఆసరాగా నిలుస్తారని, ముసలితనంలో నీడగా ఉంటారని ఆశపడింది. కానీ, ఆ బిడ్డలే పెడదోవ పట్టి తన జీవితాన్ని తీవ్ర అంధకారంలోకి నెట్టేస్తారని గ్రహించలేకపోయింది. కన్నప్రేమ కరిగిపోయి, తీవ్ర మనోవేదన కన్నీటి చుక్కగా మారిన వేళ, ఆ తల్లి గుండె పగిలింది. చివరికి ఆ నిస్సహాయక తల్లి ఆత్మహత్య చేసుకుంది.

బాధితురాలిని రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామానికి చెందిన తిరుపతి రవీందర్ భార్య సుధగా గుర్తించారు. ఆమె KPHB సర్దార్ పటేల్ నగర్‌లోని ఒక ప్రైవేట్ హాస్టల్లో హౌస్‌కీపింగ్ పనిచేస్తూ, అక్కడే ఒక గదిలో నివాసముంటోంది. సుధకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కొడుకు కొన్నేళ్ల క్రితం కన్న తండ్రినే హత్య చేసిన కేసులో నిందితుడిగా చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక చిన్న కొడుకు గంజాయికి బానిసై నిత్యం డబ్బుల కోసం, ఇతర విషయాల్లో తల్లిని తీవ్రంగా వేధించేవాడు. ఒక కొడుకు జైలుపాలు కావడం, మరో కొడుకు వ్యసనానికి బానిసగా మారి తనను వేధిస్తుండటంతో సుధ తీవ్ర మానసిక క్షోభకు గురైంది. భవిష్యత్తుపై ఆశ కోల్పోయిన ఆమె హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపడుతున్నారు. సమాజంలో చెడు వ్యసనాలు, పెడదోవ పడుతున్న యువత వల్ల కుటుంబాలు ఏ విధంగా కూలిపోతున్నాయో చెప్పడానికి ఈ ఘటన ఒక సజీవ సాక్ష్యం. కన్నబిడ్డల బాధ్యతారాహిత్యం, మత్తు పదార్థాల మహమ్మారి ఒక అమాయక తల్లి ప్రాణాన్ని బలితీసుకోవడం సమాజ నైతికతకే తీరని కలంకమై నిలిచింది.