Reading Time: 2 minutes
Hero Nagarjuna Reveals He Was A Cyber Fraud Victim 4 Years Ago

Nagarjuna Cyber Fraud Story: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ప్రత్యేక సైబర్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు. ‘Stay Alert – Stay Aware – Stay Safe & Secure’ అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హీరో కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్పార్క్ క్లబ్‌లకు చెందిన విద్యార్థుల ప్రతినిధులతో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరసత్వం గురించి వివరించడం, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండేలా ప్రజలను చైతన్యపరచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. పెరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, పాస్‌వర్డ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

సైబర్ ఫ్రాడ్‌కు గురయ్యాను:

సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు నాగార్జున సూచించారు. గతంలో తాను కూడా సైబర్ మోసంకు గురయ్యాయని వెల్లడించారు. ‘నాలుగేళ్ల క్రితం నేను కూడా సైబర్ ఫ్రాడ్‌కు గురయ్యాను. బ్యాంక్ అధికారి పేరుతో నాకు ఒక కాల్ వచ్చింది. నా వ్యాపారాల గురించి తెలిసిన వ్యక్తిలా మాట్లాడి.. మంచి లాభాలు వచ్చే ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ ఉందని నమ్మించేందుకు ప్రయత్నించాడు. నాగార్జున గారు మీరు బిజినెస్‌లో చాలా స్మార్ట్ అని విన్నాను. మరి ఎందుకు ఇన్వెస్ట్ చేయడం లేదు?. ఇది చాలా గొప్ప లాభాలు ఇచ్చే స్కీమ్ అంటూ మాటల్లో పెట్టి మోసం మరీ మాయ చేశాడు. సాధారణంగా నా ఆర్థిక వ్యవహారాలన్నింటినీ మేనేజర్ చూసుకుంటారు. అయితే నేరుగా బ్యాంక్ అధికారి పేరుతో ఫోన్ రావడంతో నిజమని నమ్మాను’ అని నాగార్జున తెలిపారు. సైబర్ మోసాలు ఎంత తెలివిగా జరుగుతున్నాయో అర్థమయ్యేలా ఈ ఘటనతో తనకు తేలిందన్నారు.

డ్రగ్స్ ఉన్నాయి అంటూ బెదిరించారు:

తన బంధువు ఒకరు షూటింగ్ కోసం ఇరాన్ వెళ్లినప్పుడు ఎదురైన మరో ఘటనను కూడా నాగార్జున వివరించారు. ‘నా బంధువు ఒకరు షూటింగ్ కోసం ఇరాన్ వెళ్ళింది. ఆమె ఎయిర్‌పోర్టులో దిగిన కొద్ది నిమిషాలకే ఓ ఫోన్ కాల్ వచ్చింది. మేము పోలీసులం, మీ బ్యాగేజీలో నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి అంటూ బెదిరించారు. రూమ్ నుంచి బయటకు రావద్దని, వీడియో కాల్‌లోనే ఉండాలని చెప్పారు. అయితే ఆమెకు సైబర్ మోసాలపై అవగాహన ఉండటంతో వెంటనే విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫోన్ చేసినట్లు చెప్పింది. అనంతరం నాకు కూడా సమాచారం ఇచ్చింది’ అని నాగార్జున తెలిపారు.

ఒక్క ఫోటో కూడా తీసుకోను:

అప్పటినుంచి సైబర్ భద్రత విషయంలో తాను చాలా జాగ్రత్తగా ఉంటానని నాగార్జున వెల్లడించారు. ‘ప్రతి 15 రోజులకు నా పాస్‌వర్డ్స్ అన్నింటినీ మార్చుకుంటాను. నా ఫోన్‌లో నేను ఒక్క ఫోటో కూడా తీసుకోను. చాలా అప్రమత్తంగా ఉంటాను’ అని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్‌లను నమ్మకపోవడం, బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోకపోవడం వంటి అంశాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కింగ్ సూచించారు.

భారతీయ సినీ పరిశ్రమకు మేలు:

సైబర్ క్రైమ్‌ను అరికట్టడంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉండటం గొప్ప విషయమని నాగార్జున ప్రశంసించారు. ఇది తెలంగాణ పోలీసుల కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే పైరసీని అరికట్టడంలో డీజీపీ సీవీ ఆనంద్, కమిషనర్ సజ్జనార్ చేసిన కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారు తీసుకున్న చర్యల వల్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకే కాకుండా మొత్తం భారతీయ సినీ పరిశ్రమకు మేలు జరిగిందని కొనియాడారు. సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త రూపాల్లో జరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలు అవగాహన పెంచుకోవడం, అప్రమత్తగా ఉండడం అత్యంత ముఖ్యం.