Reading Time: 2 minutes
Kusal Mendis Childhood Coach Sumith Fernando Dies Before Ind Vs Sl 1st Test

Kusal Mendis Childhood Coach Sumith Fernando Death: భారత్‌తో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. శ్రీలంక వన్డే కెప్టెన్ కుశాల్ మెండిస్ చిన్ననాటి కోచ్‌ సుమిత్ ఫెర్నాండో మృతి చెందారు. 62 ఏళ్ల ఫెర్నాండో కొలంబోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. యువ క్రికెటర్ల మధ్య జరిగిన గొడవలో గాయపడగా.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. కీలక భారత పర్యటనకు ముందు ఈ విషాద ఘటన చోటుచేసుకోవడం శ్రీలంక క్రికెట్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఆటగాళ్లు, మైదాన సిబ్బంది మధ్య వాగ్వాదం:

శ్రీలంక మీడియా ప్రకారం.. ఆగస్టు 8న కొలంబోలోని బ్లూమ్‌ఫీల్డ్ క్రికెట్ అండ్ అథ్లెటిక్ క్లబ్ మైదానంలో గొడవ జరిగింది. కొలంబోలోని ఒక ప్రముఖ క్రికెట్ శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్న యువ క్రికెటర్లు విరామ సమయంలో తాగునీటి కోసం ట్యాప్ వద్దకు వెళ్లారు. అక్కడ నీరు అందుబాటులో లేకపోవడంతో మైదాన సిబ్బందితో వివాదం మొదలైంది. ఆటగాళ్లు, మైదాన సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ తీవ్ర రూపం దాల్చడంతో కోచ్ సుమిత్ ఫెర్నాండో రంగంలోకి దిగారు. ఇరు వర్గాలకు సర్దిచెప్పి గొడవను సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఫెర్నాండో ఒక ఆటగాడిపై చేయి చేసుకున్నాడు.

తీవ్రంగా గాయపడ్డ ఫెర్నాండో:

17 ఏళ్ల యువ క్రికెటర్ ప్రతి దాడి చేయడంతో కోచ్ ఫెర్నాండో తీవ్రంగా గాయపడ్డారు. 62 ఏళ్ల కోచ్ మైదానంలోనే కిందపడిపోయారు. వెంటనే ఆయనను కొలంబో నేషనల్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనలో పోలీసులు 17 ఏళ్ల యువ క్రికెటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మైనర్ కావడంతో అతడిని కొలంబో మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 17 వరకు ప్రొబేషన్ అండ్ చైల్డ్‌కేర్ సర్వీసెస్ శాఖ సంరక్షణలో ఉంచారు.

కొనసాగుతోన్న దర్యాప్తు:

అయితే సుమిత్ ఫెర్నాండో మృతికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. వైద్య నివేదికల్లో ఆయనకు ముందుగానే గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు తేలింది. ఘర్షణలో గాయాల ప్రభావమా? లేదా ఆరోగ్య సమస్యల కారణంగానే పరిస్థితి విషమించిందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఘర్షణకు దారితీసిన పరిస్థితులు, దాడి జరిగిన విధానం, అనంతరం ఫెర్నాండో ఆసుపత్రికి చేరే వరకు జరిగిన పరిణామాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

శ్రీలంక క్రికెట్‌తో అనుబంధం:

సుమిత్ ఫెర్నాండోకు శ్రీలంక క్రికెట్‌తో అనుబంధం ఉంది. మోరటువాలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కాలేజీలో కోచ్‌గా పనిచేసిన ఆయన.. ఎంతో మంది యువ క్రికెటర్లను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. శ్రీలంక ప్రస్తుత వన్డే కెప్టెన్ కుశాల్ మెండిస్ కూడా పాఠశాల రోజుల్లో ఫెర్నాండో వద్ద శిక్షణ పొందాడు. బ్లూమ్‌ఫీల్డ్ క్రికెట్ అండ్ అథ్లెటిక్ క్లబ్‌లో క్యూరేటర్‌గా కూడా ఆయన పనిచేశారు. కోచ్‌గా, మైదాన నిర్వహణలో భాగస్వామిగా శ్రీలంక దేశవాళీ క్రికెట్ వర్గాల్లో ఫెర్నాండోకు మంచి గుర్తింపు ఉంది. యువ ఆటగాళ్ల అభివృద్ధిలో ఆయన చేసిన సేవలను క్రికెట్ వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. కీలక సిరీస్‌కు కొద్ది రోజుల ముందు అయన మృతి చెందడంతో లంక క్రికెట్‌ విషాదం చోటుచేసుకుంది.