
- ప్రధానమంత్రి కార్యాలయం నిర్వహించిన ‘ప్రగతి’ సమీక్షలో ఫస్ట్ ర్యాంక్
- ఈ-జీరో ఎఫ్ఐఆర్, ఎస్4సీ, సమన్వయ, సహ్యోగ్, ఎంఆర్ఎం, జీఆర్ఎం అమల్లో రాష్ట్రానికి కేంద్రం ప్రశంసలు
- వివరాలు వెల్లడించిన టీజీ సీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు అందించే సేవలు, డిజిటల్ ప్లాట్ఫామ్ల సమర్థ వినియోగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) గురువారం నిర్వహించిన ‘ప్రగతి’ జాతీయ స్థాయి సమీక్ష సమావేశంలో సైబర్ క్రైమ్ పనితీరుకు సంబంధించిన తొమ్మిది కీలక అంశాల్లో తెలంగాణకు ఫస్ట్ ర్యాంకు లభించింది.
దేశవ్యాప్తంగా రాష్ట్రాల పనితీరును అంచనా వేసేందుకు నిర్వహించిన ఈ సమీక్షలో స్టేట్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్(ఎస్4సీ) ఏర్పాటు చేయడంతో పాటు ఈ- జీరో ఎఫ్ఐఆర్ అమలు, గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం (జీఆర్ఎం), మనీ రెస్టోరేషన్ మాడ్యూల్ (ఎంఆర్ఎం), సహ్యోగ్ పోర్టల్, సమన్వయ పోర్టల్ వినియోగం, సైబర్ హాట్ స్పాట్ల గుర్తింపు, పోలీసులకు సామర్థ్యాభివృద్ధి, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలులాంటి 9 అంశాలను పరిశీలించారు. ఈ అన్ని విభాగాల్లో తెలంగాణ అత్యుత్తమ పనితీరు కనబరిచినట్టు టీజీ సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు. జాతీయస్థాయిలో తెలంగాణ మొదటి స్థానం దక్కించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ ) చేపట్టిన వినూత్న కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి.
జీఆర్ఎంలో 88 శాతం పరిష్కారం
బ్యాంకు ఖాతాల ఫ్రీజ్, అన్ఫ్రీజ్, డెబిట్ హోల్డ్లకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం రూపొందించిన జీఆర్ఎం (గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం) పోర్టల్లో ఆగస్టు 2 నాటికి 2,368 దరఖాస్తులు నమోదు కాగా, వాటిలో 2,086 కేసుల్లో చర్యలు తీసుకొని 88 శాతం పరిష్కారం సాధించినట్టు వెల్లడైంది.అలాగే, ఎంఆర్ఎం (మనీ రెస్టోరేషన్ మాడ్యూల్ ) ద్వారా ఆగస్టు 2 నాటికి 34,524 కేసుల్లో రూ.16.42 కోట్ల మేర బాధితులకు తిరిగి చెల్లించదగిన మొత్తాన్ని గుర్తించారు. ఇందులో 81.38 శాతం కేసుల్లో పోలీసుల ఆదేశాలు జారీ అయ్యాయి. రూ.50 వేల వరకు కోర్టు ఉత్తర్వులు లేకుండానే నిబంధనల మేరకు బాధితులకు సొమ్ము తిరిగి అందించే విధానం అమల్లో ఉందని అధికారులు తెలిపారు.
సహ్యోగ్, సమన్వయ పోర్టల్లోనూ మెరుగైన ఫలితాలు
సహ్యోగ్ పోర్టల్ ద్వారా అక్రమ ఆన్లైన్ కంటెంట్ తొలగింపులో 89.41 శాతం విజయశాతం నమోదు కాగా, సమన్వయ పోర్టల్ ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 6,721 అభ్యర్థనల్లో 96.68 శాతం పరిష్కరించినట్టు వెల్లడైంది. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ నుంచి 7,018 అభ్యర్థనలు పంపగా.. అందులో 79.22 శాతం పర్కిష్కారమైనట్టు అధికారులు తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా 5,493 మంది నేరస్థుల ప్రొఫైళ్లను అప్లోడ్ చేసినట్టు పేర్కొన్నారు.
‘సురక్షా కా తిరంగా’కు ఏర్పాట్లు
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, సురక్షితమైన డిజిటల్ వినియోగాన్ని ప్రోత్సహించడం, సైబర్ నేరాల నివారణలో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సురక్షా కా తిరంగా’ కార్యక్రమానికి రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాట్లు ముమ్మరం చేసింది. జాతీయ సైబర్ జాగ్రూకత దివస్లో భాగంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ‘సురక్షా కా తిరంగా’.. ‘ -సైబర్ స్వతంత్ర దిశగా తెలంగాణ’ అనే నినాదంతో ప్రచారాన్ని నిర్వహిస్తోంది.
జాతీయ పతాకం స్ఫూర్తితో రూపొందించిన ఈ ప్రచారం కార్యక్రమంలో కాషాయం-..బీ అలర్ట్, తెలుపు.. బీ అవేర్, ఆకుపచ్చ.. బీ సేఫ్ అనే సందేశాల ద్వారా సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఆన్లైన్లో జాగ్రత్తగా వ్యవహరించడం, సురక్షితమైన డిజిటల్ అలవాట్లను అవలంబించడం లక్ష్యంగా ఈ ప్రచారం సాగనుంది. కాగా, ఈ ప్రచారాన్ని బుధవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీజీ సీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్, ఇతర సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.