
వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం ప్రారంభంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ల్లో 14, 13, 15 పరుగులతో నిరాశపరిచినప్పటికీ, జింబాబ్వేపై తిరిగి పుంజుకుని 50, 20, 81 పరుగులతో రాణించాడు. ఈ నేపథ్యంలో ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ దిగ్గజం అజింక్య రహానే, యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ఒక కీలకమైన హెచ్చరిక చేశాడు. ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ పూర్తిగా వేర్వేరు విషయాలని రహానే స్పష్టం చేశాడు.
స్టిక్ టు క్రికెట్ పాడ్కాస్ట్లో రహానే మాట్లాడుతూ, “ఆ యువ ఆటగాడిపై ఇప్పుడే వ్యాఖ్యానించి అనవసర ఒత్తిడి పెంచడం నాకు ఇష్టం లేదు. అతడు ఇప్పటివరకు కేవలం రెండు ఐపీఎల్ సీజన్లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్లో 4 లేదా 5 ఓవర్లలో 70 పరుగులు ఛేజ్ చేయడం సులభమే కావచ్చు, కానీ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఉండే ఒత్తిడి, అదే లక్ష్యాన్ని ఛేజ్ చేయడం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కాబట్టి అతడిని స్వేచ్ఛగా ఆడనివ్వండి, ఎదగనివ్వండి” అని వ్యాఖ్యానించాడు.
మరోవైపు భారత మాజీ బ్యాటర్ మహమ్మద్ కైఫ్ టీమిండియా యాజమాన్యం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2026లో ఆరంజ్ క్యాప్ సాధించి అద్భుతమైన ఫామ్లో ఉన్న వైభవ్ను ఐర్లాండ్ పర్యటనలోనే తుది జట్టులోకి తీసుకోవాల్సిందని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ప్రత్యేకమైన ప్రతిభ ఉన్న ఇటువంటి ‘ఎక్స్-ఫ్యాక్టర్’ ఆటగాడిని వెంటనే బరిలోకి దించకుండా, వాటర్ బాయ్గా కూర్చోబెట్టడం ఆశ్చర్యకరమని విమర్శించాడు. ఐర్లాండ్లోనే అరంగేట్రం చేయించి ఉంటే అతడికి భయం పోయి, ఇంగ్లాండ్ సిరీస్లో మరింత బాగా రాణించి ఉండేవాడని కైఫ్ పేర్కొన్నాడు.