
Hyderabad: అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన లైంగిక వేధింపులు, హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ విచారణ రెండో రోజుకు చేరింది. నిన్న హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ స్వయంగా విచారించగా, నేడు కూడా దర్యాప్తు బృందం మరోసారి ప్రశ్నించనుంది. బాధితురాలైన ట్రైనీ మహిళా ఐపీఎస్తో పరిచయం నాటి విషయాలు, నేరానికి ఉపయోగించిన కత్తి ఎక్కడుంది? ఆధారాలు ఉన్న ఐఫోన్ను ఇప్పటివరకు పోలీసులకు ఎందుకు అందజేయలేదు? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. విచారణలో భాగంగా కొన్ని కీలక ప్రశ్నలకు ఉదయ్ కృష్ణారెడ్డి సమాధానాలు దాటవేస్తుండటం, సాక్ష్యాలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తుండటంపై సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాల దాచివేతలో ప్రమేయం ఉందనే అనుమానంతో ఉదయ్ మేనమామ, తమ్ముడిని కూడా దర్యాప్తు బృందం ఇప్పటికే ప్రశ్నించింది. మరోవైపు గతంలో మరొక మహిళను కూడా ఎందుకు వేధించాల్సి వచ్చిందనే కోణంలో లోతుగా దర్యాప్తు జరుపుతున్న పోలీసులు, నేటి కస్టడీ అనంతరం సేకరించిన వివరాలతో ఉదయ్ను కోర్టులో హాజరుపరచనున్నారు.