Reading Time: < 1 minute
కిలోపై రూ.200 అదనం.. అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!

క్షోభంలో కూరుకుపోతున్న ఆక్వా రంగానికి కొత్త ఊపిరి ఊదుతూ.. కోస్తా జిల్లాల్లో మళ్లీ బ్లాక్ టైగర్’ రొయ్యల సాగు జోరందుకుంది. 980, 90ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రైతులంతా టైగర్ రొయ్యలనే పండించేవారు. అయితే, వ్యాధులు, వైరస్‌ల దాడి వల్ల ఈ సాగు దెబ్బతింది. ముఖ్యంగా వైట్ స్పాట్ తీవ్రంగా వ్యాపించడంతో బ్లాక్ టైగర్ రొయ్యల సాగు పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో రైతులు ప్రత్యామ్నాయంగా ఉత్తర అమెరికాకు చెందిన వనామీ జాతి రొయ్యల సాగు వైపు మళ్లారు.దీంతో 1995 ప్రాంతం నుంచి వనామీ రొయ్యల పెంపకం ఊపందుకుంది.

వనామీ vs బ్లాక్ టైగర్: తేడాలేంటి?

వనామీ రొయ్యలు నీటి మధ్యలో ఈదుతూ జీవిస్తాయి. దీనివల్ల వాటికి వ్యాధులు సోకే ప్రమాదం తక్కువ. కానీ బ్లాక్ టైగర్ రొయ్యలు నీటి అడుగుభాగాన జీవిస్తాయి. అందువల్ల వీటికి వ్యాధులు వచ్చే అవకాశం కాస్త ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వనామీ సాగుకు తక్కువ ఉప్పు శాతం ఉన్న నీరు సరిపోతుంది. కానీ టైగర్ రొయ్యల పెంపకానికి నీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండాలి.

అందుకే ఇప్పుడు సముద్ర తీర ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇక పంట కాలం, పెరిగే పరిమాణం విషయానికి వస్తే.. వనామీ రొయ్యలను 35 నుండి 40 కౌంట్ వరకే పెంచడం రైతులకు సాధ్యమవుతుంది. కానీ, బ్లాక్ టైగర్ రొయ్యలు 20 కౌంట్ వరకు మాత్రమే పెరుగుతాయి.

రైతులకు ‘వరంగా’ మారిన టైగర్.. ఎంత లాభం?

ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో దాదాపు 800 ఎకరాల్లో బ్లాక్ టైగర్ సాగు మళ్లీ మొదలైంది. గడిచిన రెండేళ్లుగా ఆక్వా రైతులు ఈ రొయ్యల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. సాధారణ వనామీ రొయ్యలతో పోలిస్తే, ఈ బ్లాక్ టైగర్ రొయ్యల మార్కెట్ ధర కిలోపై దాదాపు రూ. 200 అధికంగా ఉంటుంది.

కౌంట్ పెద్దదిగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు భారీగా లాభాలు సమకూరుతున్నాయి. వ్యాధుల భయం తగ్గడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన సీడ్ లభించడంతో కోస్తా ఆక్వా రంగానికి ఈ ‘బ్లాక్ టైగర్’ మళ్లీ మహర్దశ తీసుకొస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.