
న్యూఢిల్లీ: శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు మరో బిగ్ షాకే తగిలే అవకాశం ఉంది. గాయం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే ఈ సిరీస్కు దూరమైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే.. స్టార్ బ్యాటర్ సాయిసుదర్శన్ సైతం శ్రీలంకతో జరగనున్న తొలి టెస్ట్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. గత నెలలో శ్రీలంక ఏతో జరిగిన అనధికారిక టెస్ట్ సిరీస్లో సాయిసుదర్శన్ గాయపడ్డాడు.
కాలి వేలికి గాయం కావడంతో ప్రస్తుతం బెంగళూర్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఆగస్ట్ 15 నుంచి సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆగస్ట్ 4న టీమిండియా శ్రీలంకకు వెళ్లింది. సాయిసుదర్శన్ మాత్రం భారత జట్టుతో ప్రయాణించలేదు. గాయం పూర్తిగా నయం కాకపోవడంతో అతడు తొలి టెస్ట్కు దూరమయ్యే అవకాశం ఉంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్పైనే అతను ఈ సిరీస్లో ఆడుతాడా లేదా అనే దానిపై ఆధారపడి ఉంది.
సాయిసుదర్శన్ కండిషన్పై బీసీసీఐ వర్గాలు అప్డేట్ ఇచ్చాయి. ‘‘శ్రీలంకతో జరుగుతున్న రెండు మ్యాచ్ల సిరీస్లో మొదటి టెస్టుకు సుదర్శన్ దూరమయ్యే అవకాశం ఉంది. సుదర్శన్ ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో ఉన్నారు. ఆగస్టు 4న భారత జట్టుతో పాటు అతడు శ్రీలంక ప్రయాణించలేదు. సుదర్శన్ కాలి వేలి గాయం నుంచి కోలుకుంటు గంటకు పైగా నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
రాబోయే మూడు, నాలుగు రోజుల పాటు అతని పరిస్థితిని పర్యవేక్షించిన తర్వాతే.. అతను ఆడేందుకు అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై తుది నిర్ణయం అధికారులు తీసుకుంటారు. అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి వచ్చే ముందు అతను పూర్తిగా ఫిట్గా ఉన్నాడని నిర్ధారించుకోవడం ముఖ్యం’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఈ టెస్ట్ సిరీస్లో ఇండియా, శ్రీలంక మధ్య రెండు మ్యాచులు జరగనున్నాయి. ఆగస్ట్ 15 తొలి టెస్ట్, ఆగస్ట్ 23న రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే టీమిండియాకు ఈ సిరీస్ ఎంతో కీలకం. దీంతో ఎలాగైనా సిరీస్ గెలవాలని గిల్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు.. సొంతగడ్డపై ఇండియాను చిత్తు చేయాలని శ్రీలంక ఉవ్విళ్లూరుతోంది.