
ఎక్కడో సుదూర దట్టమైన అడవుల్లో సంచరించే అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా హఠాత్తుగా జనవాసాల మధ్య ప్రత్యక్షమై తీవ్ర కలకలం రేపింది. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో భారీ కింగ్ కోబ్రా ప్రత్యక్షమవ్వడంతో స్థానికులు ఒక్కసారిగా ప్రాణభయంతో పరుగులు తీశారు. మొగల్తూరు కోట ప్రాంతంలోని సంకువారి మామిడితోటలో సంచరిస్తున్న ఈ భారీ రాజనాగును గమనించిన స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సుమారు 6 మీటర్ల (దాదాపు 20 అడుగులు) పొడవున్న ఈ పాము తోటలో పడగవిప్పి బుసలు కొడుతూ కనిపించింది. దూరం నుంచి దానిని గమనించిన కొందరు వ్యక్తులు తమ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ దృశ్యాలు క్షణాల్లో వైరల్గా మారింది.
అనుమానాలు – భయాలు
ఈ మామిడితోట ప్రధాన రహదారితో పాటు సమీప నివాసాలకు అతి దగ్గరలోనే ఉంది. దాంతో స్థానిక ప్రజలు, వాహనదారులు పాము గురించి తెలిసి భయాందోళన చెందుతున్నారు. ఇంత భారీ పరిమాణంలో ఉన్న కింగ్ కోబ్రా సదరు తోటలోనే గుడ్లు పెట్టి స్థావరం ఏర్పరచుకుని ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. అడవుల్లో ఉండాల్సిన ప్రమాదకర పాము ఇలా ఊరి చివర కనిపిస్తుండటంతో ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
అధికారులు స్పందించాలి
పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. స్నేక్ క్యాచర్ల సహాయంతో ఈ భయంకర రాజనాగును సురక్షితంగా బంధించి, సుదూర అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలని పరిసర ప్రాంతాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.