
వీసా దరఖాస్తు ప్రక్రియలో తప్పుడు, అసంపూర్తి సమాచారాన్ని సమర్పించినందుకు పాకిస్తాన్ క్రికెటర్ హమ్జా నజర్పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అతడిని రెండు సంవత్సరాల పాటు అన్ని రకాల డొమెస్టిక్ , ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు, 10 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా విధించింది.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు పీసీబీ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. బోర్డు ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో ఆల్ రౌండర్ హమ్జా నజర్ కీలకమైన విషయాలను దాచిపెట్టాడని, దరఖాస్తులో భ్రమపరిచే వివరాలను నమోదు చేశాడని ఈ కమిటీ విచారణలో తేలింది. హమ్జా నజర్కు తన వివరణ ఇచ్చుకునేందుకు పూర్తి అవకాశం ఇచ్చిన తర్వాతే, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి కమిటీ ఈ నివేదికను పీసీబీకి సమర్పించింది.
సమాచారాన్ని దాచడం, తప్పుడు వివరాలు ఇవ్వడం వంటి చర్యలను పీసీబీ అత్యంత తీవ్రంగా పరిగణిస్తుందని బోర్డు తన ప్రకటనలో తెలిపింది. పీసీబీ, పాకిస్తాన్ క్రికెట్ లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అభిమానుల వద్ద క్రీడ యొక్క ప్రతిష్టకు భంగం కలిగించే ఏ చర్యను సహించేది లేదని స్పష్టం చేసింది. ఈ నిషేధం వల్ల హమ్జా నజర్ పాకిస్తాన్ జాతీయ జట్టులోకి అడుగుపెట్టే అవకాశం మరింత ఆలస్యం కానుంది.
మరొక వైపు.. జాంబియాలోని లుసాకాలో నిర్వహించిన అనధికారిక ‘ఆసియా లెజెండ్స్’ టోర్నమెంట్లో పాల్గొన్నందుకు వేగవంతమైన బౌలర్ మహమ్మద్ ఇర్ఫాన్తో సహా పలువురు మాజీ పాకిస్తాన్ ఆటగాళ్లపై కూడా రెండు సంవత్సరాల నిషేధం పడే అవకాశం ఉంది. అనుమతి లేని టోర్నమెంట్లలో ఆడే క్రీడాకారులపై కఠిన చర్యలు ఉంటాయని, వారు రెండేళ్ల పాటు పీసీబీ లేదా పీఎస్ఎల్లో ఎలాంటి పదవులు పొందకుండా, విదేశీ లీగ్లలో ఆడకుండా నిషేధిస్తామని పీసీబీ స్పష్టం చేసింది.